Thursday, January 6, 2011

రైతు కష్టాలు కేంద్రానికి తెలిపేందుకే..... జగన్ ఢిల్లీ దీక్ష

జగన్ ఢిల్లీ దీక్షపై అంబటి రాంబాబు స్పష్టీకరణ
కేంద్ర జలపంపిణీ విధానం ఉండాలన్నదే
జగన్ ప్రధాన డిమాండ్
వైఎస్‌పై చంద్రబాబు విమర్శలు సరికాదు
ఆయన హయాంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే
ఈ అనర్థం వచ్చేది కాదు
* ట్రిబ్యునల్ లో గట్టి వాదనలు వినిపించడంలో రాష్ట్రం విఫలమైందని జనం భావిస్తున్నారు

  కృష్ణానది ప్రాజెక్టుల పరిధిలోని రైతాంగం భయాందోళనలనూ, వారి కష్టాలనూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11న ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఒకరోజు దీక్షను చేపడుతున్నారని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు తెలిపారు. ఆయన బుధవారం సాగర్ సొసైటీలోని జగన్ క్యాంపు కార్యాలయంవద్ద ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు, శా్‌ప్ మాజీ చైర్మన్ పి.ఎన్.వి.ప్రసాద్, పీసీసీ కార్యదర్శి జనక్ ప్రసాద్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావుతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ జగన్ దీక్ష వివరాలను వెల్లడించారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందనే ఆందోళన రైతుల్లో నెలకొని ఉందని, దానిని దృష్టిలో ఉంచుకునే.. కేంద్రం ఒక జల పంపిణీ విధానాన్ని ఏర్పాటు చేయాలని జగన్ కోరుతున్నారని ఆయన తెలిపారు.

మిగులు జలాలు అక్కర లేదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాసిన లేఖ ఫలితంగానే కృష్ణా డెల్టా రైతులకు అన్యాయం జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఆ వాదనను అంబటి ఖండించారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటై, విచారణ ప్రారంభించిన తరుణంలో కడుతున్న ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులుగా భావించరాదనే ఉద్దేశంతో వైఎస్ ఈ లేఖ రాశారేతప్ప మరో ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో కృష్ణానదిపై వైఎస్ ప్రతిపాదించిన ప్రాజెక్టులు కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటయ్యే నాటికే పూర్తి కావాల్సినవని, కానీ తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వాటి జోలికే పోనందువల్ల వచ్చిన అనర్థమిదని ఆయన వివరించారు. చంద్రబాబు ఇరిగేషన్ ఊసెత్తక పోవడంవల్ల రాష్ట్ర రైతులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. ట్రిబ్యునల్ ముందు మన న్యాయవాదులు సరిగ్గా వాదనలు వినిపించలేదని, ప్రభుత్వం వారికి కావాల్సిన సమాచారాన్ని అందించలేకపోయిందని వస్తున్న విమర్శలను ప్రస్తావించగా... ‘‘ఉండొచ్చు, ప్రభుత్వ లోపాలు కావచ్చు.. మరొకటి కావచ్చు, ఈ భావం ప్రజల్లో నెలకొని ఉంది’’ అని అంబటి బదులిచ్చారు. అయితే వైఎస్ ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్న అభిప్రాయమూ రైతుల్లో బలంగా నెలకొని ఉందన్నారు. జగన్ దీక్ష కూడా ట్రిబ్యునల్ తీర్పునకు నిరసనగా కాదని, కేంద్ర జల పంపిణీ విధానం ఉండాలన్నదే ప్రధాన డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇది బల ప్రదర్శన కూడా కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. జగన్ తన ఓదార్పు యాత్రకు మధ్యలో విరామం తీసుకుని ఢిల్లీ వెళుతున్నది రైతుల కష్టాలను ఎలుగెత్తి చాటడానికేనని, అపుడైనా కేంద్రం కళ్లు తెరుస్తుందని భావిస్తున్నామని రాంబాబు అన్నారు. జగన్ పార్టీ స్థాపించిన తరువాత రాష్ట్రంలోని అన్ని కీలకమైన సమస్యలపైనా స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తారని ఆయన చెప్పారు.

జగన్ జనం వెంట వస్తారు..

ఈ నెల 9వ తేదీ సాయంత్రం జగన్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి ఢిల్లీకి బయలుదేరతారని అంబటి తెలిపారు. జిల్లాల్లో తమకున్న యంత్రాంగం ద్వారా ఢిల్లీకి వెళ్లేవారిని ఎంపిక చేశామని వివరించారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రత్యేక రైలులో బయలుదేరతారని చెప్పారు. రైలులో 1,400 నుంచి 1,800 మంది వరకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. రాష్ట్రం నలుమూలలనుంచి వేలాదిమంది అభిమానులు ఢిల్లీకి జగన్ వెంట రావడానికి ఉబలాట పడుతున్నారని, అయితే అందరినీ తీసుకెళ్లడం సాధ్యం కాదనే విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ అపార్థం చేసుకోవద్దని కోరారు.

ఢిల్లీ దీక్షలో జగన్ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు పాల్గొంటారని ప్రశ్నించినపుడు.. ‘‘చూద్దాం, ఎంత మంది వస్తారో... మేమలాంటి అంచనాలేమీ వేయడం లేదు’’ అని ఆయన సమాధానమిచ్చారు. ఢిల్లీలో విపరీతమైన చలిగాలులున్నాయి కనుక దీక్షకు వచ్చేవారు తప్పనిసరిగా స్వెట్టర్లు, శాలువాలు, దుప్పట్లు, కాళ్లకు సాక్సులు, చేతులకు గ్లోవ్స్ వంటివి తెచ్చుకోవాలని అంబటి సూచించారు. విలేకరుల సమావేశంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వద్దిరెడ్డి చలమారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ బి.మోహన్‌కుమార్, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.పుల్లయ్య కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment