Thursday, May 3, 2012

మహాసంగ్రామానికి నాంది

*ఉప ఎన్నికలపై జగన్ వ్యాఖ్య
*ఈ ఎన్నికల్లో వేసే ఓటుతో ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలగాలి
* వైఎస్ చనిపోయాక గాలేరు-నగరి పనులు ఎక్కడికిపోయాయో తెలీదు
*కాంగ్రెస్ వాళ్లు ప్రచారానికొస్తే నీటి సమస్యపై నిలదీయండి
*వైఎస్ బతికున్నప్పుడు తిరుపతిలో పేదలకు 27 వేల ఇళ్లు కట్టించారు
* ఆయన చనిపోయాక ఒక్కటంటే ఒక్క ఇల్లూ ఇవ్వలేదేమని కాంగ్రెస్ వారిని ప్రశ్నించండి



 ‘ఈ కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను ఎంతగా దిగజార్చారూ అంటే.. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థాలను టార్చిలైట్ వేసి వెతికినా కనిపించే పరిస్థితి లేదు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తేవాలి.. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావాలి.. విలువలను తిరిగి తేవాలి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చేలా జరగబోతున్న ఈ ఉప ఎన్నికలు.. రేపు జరుగబోయే మహా సంగ్రామానికి నాంది పలకనున్నాయి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రైతు, పేదవాడు ఎలా బతుకుతున్నాడో పట్టించుకోని ఈ పాలకులకు వారి బాధను తెలియజెప్పేలా ఉప ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.


‘రాష్ట్ర పాలకులకు, వారిని ఢిల్లీ నుంచి రిమోట్‌తో నడిపిస్తున్న పెద్దలకు ఉప ఎన్నికల తీర్పుతో కనువిప్పు కావాలి’ అని జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న భూమన కరుణాకరరెడ్డి తరఫున జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నిర్వహించిన ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే సువర్ణయుగంలో అవకాశముంటే టీటీడీ కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తాం. వారికి కనీస వేతనం అందేలా కృషి చేస్తాం. వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించుకునేందుకు కృషి చేస్తాం’ అని జగన్ హామీ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

చిరంజీవి తిరుపతి ప్రజల్ని గాలికొదిలేశారు..

పేదోడికి, రైతన్నకు అండగా నిలబడినందుకు 17 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారు. ఇప్పుడు వారి స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తిరుపతిలో ఉప ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయీ అంటే.. మొన్న చిరంజీవే స్వయంగా చెప్పారు.. ఆయనకు సోనియా గాంధీ ప్రమోషన్ ఇచ్చారట.. రాజ్యసభకు పంపారట.. అందుకని ఆయన తిరుపతి ప్రజలను గాలికి వదిలేశారట. ఇంకా బాధాకరమైన విషయమేంటంటే.. రాజ్యసభకు వెళ్లే వ్యక్తి ఎక్స్ ఆఫీషియో సభ్యత్వానికి తిరుపతి నగరాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నా.. ఆయన మాత్రం హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసుకున్నారు.

అలా ఆయన గాలికి వదిలేసిన పరిస్థితిలో తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తిరుపతి తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం మహానేత వైఎస్ గాలేరు-నగరి ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఆ మహానేత చనిపోయాక గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు ఎక్కడికి పోయాయో తెలియడం లేదు. గాలేరు-నగరి పనులు జరగలేదనో, ఇక్కడున్న అక్క చెల్లెళ్లు నాలుగురోజులకొకసారి నీటి కష్టాలు పడుతున్నారనో చిరంజీవి రాజీనామా చేసుంటే సెల్యూట్ చేసుండేవాణ్ణి.

కాంగ్రెస్ వారిని నిలదీయండి: కాంగ్రెస్ వాళ్లు ఇక్కడికి(తిరుపతికి) ప్రచారానికి వస్తే ఒక మాట అడగండి. తిరుపతి నగరంలో నాలుగు రోజులకోసారిగాని ఐదు రోజులకోసారిగాని నీళ్లు దొరకని పరిస్థితిలో మేం బతుకుతున్నాం.. మీరేం చేస్తున్నారని అడగండి. ఆ మహానేత బతికి ఉన్నప్పుడు ఇక్కడ పేదలకు 27 వేల ఇళ్లు కట్టిస్తే.. ఆయన చనిపోయాక ఒక్కటంటే ఒక్క ఇల్లూ కట్టివ్వలేదేమని ప్రశ్నించండి. సాగు చేయడం కంటే ఆత్మహత్యే మేలనుకునే పరిస్థితిలో రైతు వ్యవసాయం చేస్తున్నా కూడా అతడిని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీయండి.

సంవత్సరమైపోయింది.. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు ఇప్పటికీ విడుదల చేయలేదు.. ప్రభుత్వం ఆ బకాయిలు కడుతుందో కట్టదో తెలియని పరిస్థితిలో చదువుతున్నాం మేం అని ప్రతి విద్యార్థీ కాంగ్రెస్ వాళ్లను నిలదీయండి. అనారోగ్యంతో ఉన్న పేదవాడు 108కు ఫోన్ చేస్తే 20 నిముషాల్లో రావాల్సిన అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో బతుకుతున్నామని నిలదీయండి. ఆరోగ్యశ్రీని ఎందుకు కుదించారని ప్రశ్నించండి. కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అర్హత వయసును రెండేళ్లకే కుదించారు.. రెండేళ్లలోపు మూగ, చెవుడు గుర్తించలేకపోతే.. వాడి జీవితమేమైపోవాలని నిలదీయండి.

చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు ఎంతగా కుమ్మక్కయ్యారంటే..,
ఇలాంటి పరిస్థితిలో పోనీ ప్రతిపక్షమైనా ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతుందని చూస్తే.. మన ఖర్మకొద్దీ ఆ ప్రతిపక్ష స్థానంలో చంద్రబాబు ఉన్నారు. దేశ చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో ఆయన కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కయ్యారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు చెందిన వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో ఐదెకరాల భూమిని స్వయంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ధారాదత్తం చేశారంటే వారి కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీళ్లిద్దరి కలయిక ఎంత నిస్సిగ్గుగా ఉందో తెలుసుకోవాలంటే.. వైఎస్‌పైన, చంద్రబాబుపైన సీబీఐ చేస్తున్న దర్యాప్తు తీరు చూస్తే చాలు.

వెనుకబడిన మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పరిశ్రమలు తేవాలని, ఉపాధి కల్పించాలని తలచి మహానేత.. ఎకరా 8 లక్షల చొప్పున 75 ఎకరాలను 25 ఏళ్లపాటు లీజుకిస్తే సీబీఐ తప్పు పడుతోంది. అక్కడ ఎకరా రూ.15 లక్షల రేటు పలుకుతోందీ అంటోంది. ఎమ్మార్ కేసులోనూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది.. అయితే అందులో చంద్రబాబు చేసిన తప్పు వారికి కనబడడం లేదట. వైఎస్ ఉపాధి కల్పించడానికి ఎకరాలను పరిశ్రమలకు కేటాయిస్తే.. చంద్రబాబు పెద్దలు గోల్ఫ్ ఆడుకోవడానికి, విలాసవంతమైన విల్లాలు కట్టుకోవడానికి హైదరాబాద్ నడిబొడ్డున 535 ఎకరాలను ఎమ్మార్‌కు ధారాదత్తం చేశారు. అక్కడ ఎకరా రూ.3 నుంచి రూ.4 కోట్లు పలుకుతా ఉంటే.. ఆయన ఎకరా రూ.29 లక్షల చొప్పునఎమ్మార్‌కు ఇచ్చేస్తే... ఎందుకయ్యా ఇలా చేశావూ అని సీబీఐ కనీసం అడగనైనా అడగడం లేదు.
జోరువానలోనూ.. జనప్రవాహం
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పళణి థియేటర్ సర్కిల్ రోడ్‌షోలో ప్రసంగిస్తుండగానే వర్షం మొదలైంది. అయినా జనం కట్టుకదల్లేదు.. అంత వానలో ఉద్వేగంగా జగన్ ప్రసంగిస్తుంటే.. అంతే ఆత్రుతగా అభిమానులు వింటూ వర్షాన్నే మరచిపోయారు. తర్వాత జగన్ ముత్యాలరెడ్డిపల్లె బహిరంగ సభకు చేరుకున్నారు. అక్కడా జోరు వానలో తడుస్తూనే ప్రసంగించారు. జనం కూడా వర్షాన్ని లెక్కచేయకుండా జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. వర్షం పడుతున్న సమయంలో ఆయన ఆకాశం వైపు చూసి రెండు చేతులెత్తి వరుణ దేవునికి నమస్కరించుకున్నారు.

ఆ దృశ్యాన్ని చూసిన జనం ‘వాళ్ల నాన్న లాగే వర్షం అంటే జగన్‌మోహన్‌రెడ్డికి కూడా ఎంతో ఇష్టం’ అంటూ మాట్లాడుకున్నారు. ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని తిరుపతి చేరుకున్న అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి 11.35 గంటలకు నగర శివార్లలోని ఆటోనగర్ నుంచి రెండో రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలో 10 జంక్షన్లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన్ను చూసేందుకు ఎండను లెక్కచేయక మిద్దెలపైన, భవనాల పైన కూడా గంటలకొద్దీ జనం వేచి ఉన్నారు. రోడ్‌షోలో తన ప్రసంగం వినడానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి.. పచ్చ చీర రంగు అవ్వా.. కళ్లద్దాల అవ్వా.. చెల్లెమ్మా.. అంటూ జననేత పిలుస్తుంటే జనం పులకించిపోయారు. కాగా బుధవారం సాయంత్రం తిరుపతి ప్రచారం ముగించుకున్న జగన్.. తర్వాత కడప వెళ్లారు. గురువారం ఉదయం నుంచి ఆయన రాజంపేటలో ప్రచారం నిర్వహిస్తారు.

పాపం... పేద!

 పిల్లి గుడ్డిదయితే ఎలుక ఎదురెళ్లి వెక్కిరించిందట! వేటగాడు అసమర్థుడయితే లేడి వెయ్యి గంతులేసిందట!! ఇక్కడ పిల్లి అయినా, అసమర్ధుడయిన వేటగాడయినా ప్రజలే!!! జనం తామేమి చెబుతున్నా నమ్ముతున్నారన్న భ్రమల్లో ఉన్నప్పుడే సదరు నేత ఒక ఎలుక, మరో లేడిలా భావిస్తాడు. సానుభూతి, ప్రత్యర్ధుల బలహీనతల ఆధారంగా వచ్చి పడుతున్న విజయాలతో ఊగిపోతున్న యువనేత జగన్‌.. తాజాగా తనది పేద కులమని చేసిన సంచలన, విభ్రాంతికరమైన వ్యాఖ్య జనాలను వెర్రివాళ్ల నుకునేలా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనం గొర్రెలని, ఎవరేది చెబితే అది నమ్ముతారన్న వ్యాఖ్యలు ఇప్పటివరకూ సామెతలు, సినిమాల్లో మాత్రమే వింటున్నాం. కానీ జగన్‌ మాత్రం జనాలను ఈ దృష్టితోనే చూస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మూడు ఉప ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మానసిక పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కడప లోక్‌సభ, పులివెందుల, కోవూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన జగన్‌.. తాను చెప్పినవన్నీ ప్రజలు వింటున్నారన్న అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోంది. తనపై ప్రత్యర్ధులు అవినీతిపరుడని ఆరోపిస్తున్నా ప్రజలు మూడు ఎన్నికల్లోనూ తననే గెలిపించడంతో, ఇక తాను ఏమి చెప్పినా ప్రజలు సులభంగా నమ్ముతారని, అవి నిజమని భావిస్తారన్న ధీమాకు వచ్చినట్లు ఇటీవల ఆయన చేస్తున్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి.

తనది పేదకులమని వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సొంత పార్టీలో సైతం యువనేత పేదరికంపై చర్చ జరుగుతోంది. కడప లోక్‌సభ, పులివెందుల, కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఊపులో ఉన్న జగన్‌.. తాను ఏమి చెప్పినా జనం నమ్ముతారన్న మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్నారన్న వాస్తవం ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులపై ఒకవైపు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ విచారణ చేస్తుంటే తనది పేద కులమని చెప్పడం వింతలోకెల్లా వింతని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నయి. న్యాయమూర్తులు సైతం ఏ-1 అయిన జగన్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నిస్తున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

అటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోనూ జగన్‌ వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది. తమ నేత చేసిన వ్యాఖ్య అనవసర వివాదానికి దారితీస్తుందేమో నన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు ఎన్నికల్లో గెలవటం, జగన్‌పై కాంగ్రెస్‌-టీడీపీలు ఎన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నా జనం నమ్మకపోవడంతో ఆయనలో మితిమీరిన ఆత్మవిశ్వాసం పెరిగిందని చెబుతున్నారు. ‘అన్ని పార్టీలూ అవినీతికి పాల్పడు తున్నాయి. అంతా అవినీతిపరులే. కాకపోతే కొందరు ఎక్కువ తిన్నారు. మరికొందరు తక్కువ తిన్నారని ప్రజలు భావిస్తున్నారు. అందువల్లే జనం జగన్‌ అవినీతి గురించి కాంగ్రెస్‌-టీడీపీ ఎన్ని ఆరోపణలు చేస్తున్నా నమ్మడం లేదు. దానిని చూసి మా నేత అతిగా అంచనా వేసుకుని, తానేది చెప్పినా నమ్ముతారనుకుంటే అది భ్రమే అవుతుంద’ని వైకాపా సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.

pales 

తనది పేద కులమని జగన్‌ చెప్పడం బూమరాంగ్‌ అవుతుందని, దానిని ప్రజలు నమ్మరంటున్నారు. ‘ఇప్పటివరకూ జనం జగన్‌ను నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తనది పేద కులమని చెప్పడం వల్ల జగన్‌ తమను వెర్రివాళ్లను చేస్తున్నారని ప్రజలు భావించే ప్రమాదం ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు అసలుకే ఎసరు తెస్తాయి. ప్రత్యర్థులకు అస్త్రాలు ఇచ్చినట్టవుతాయి. ఆయన ఎవరి మాట వినరు. ఎవరు చెప్పాలి?’ అని మరో సీనియర్‌ నేత ప్రశ్నించారు. కాగా, సీబీఐ, ఈడీ కేసుల నేపథ్యంలో జగన్‌ సంపాదించిన లక్ష కోట్ల ఆస్తులపై ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో తనది పేద కులమని జగన్‌ చెప్పడంతో మళ్లీ ఆయన ఆస్తులపై చర్చ సహజంగానే తెరపైకి వచ్చినట్టయింది.

బెంగళూరులో కళ్లు చెదిరే రాజమహల్‌, హైదరాబాద్‌లోని నివాసాలే దాదాపు 600 కోట్ల రూపాయల ఖరీదవుతాయన్న అంచ నా తెలిసిందే. 2008-09 ఆర్థిక సంవత్సరానికి గాను రు.2.92 లక్షల రూపాయలు ఆదాయపన్నుగా చెల్లించిన జగన్‌.. 2009-10 సంవత్సరానికి 84 కోట్ల రూపాయల ముందస్తు పన్ను చెల్లించారు. అంటే ఏడాదికి అధికారికంగానే 500 రూపాయల కోట్ల ఆదాయం ఉన్నట్టే లెక్క. జగన్‌ చెల్లించిన పన్ను ఆదాయాలను పరిశీలిస్తే.. 6 నెలల్లోనే 1,110 శాతం పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తి విలువ రు2.12 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. తనయుడు వైఎస్‌ జగన్‌ 2003-2004 ఐటి రిటర్న్‌‌సలో తన సంవత్సర ఆదాయం 9,19,951 రూపాయలని పేర్కొన్నారు.

మళ్లీ 2009 నాటి ఎన్నికల అఫిడవిట్‌లో 77.40 కోట్ల రూపాయలుగా చూపారు. 2011 ఎన్నికలో దానిని 445 కోట్లుగా చూపారు. అంటే కోటి రూపాయల ఆస్తిపరుడయిన ఒక నిరుపేద కేవలం 8 సంవత్సరాల్లో 85 కోట్ల రూపాయల అడ్వాన్సు టాక్సు చెల్లించే స్థాయికి, 445 కోట్లకు ఎలా అధిపతి అయ్యారన్న చర్చ మళ్లీ అన్ని వర్గాల్లోనూ మొదలయింది. ఇక జగన్‌ విలాసజీవితానికి బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌, బెంగళూరు బన్నేరుఘట్టరోడ్‌ లోని మంత్రి భవనం మరోసారి చర్చలోకి వచ్చింది. బెంగళూరులోని మంత్రి భవనం 5 ఎకరాల్లో ఉంది. 7 అంతస్తులున్న దీని విలువ కేవలం 400 కోట్ల రూపాయలు. దాని ద్వారా వచ్చే అద్దె ఎంతో తెలుసా.. కేవలం 27 కోట్ల రూపాయలు! ఇక లోటస్‌ పాండ్‌లోని జగన్‌ నివాసం చూస్తే ఇంద్రుడు కూడా ఈర్ష్యపడవలసిందే.

హుడా హైట్స్‌లోని ప్లాట్‌ నెంబర్లు 2,3,4,6,7,8లో 5807 చదరపు గజాల్లో 88 వేల చదరపు అడుగుల్లో కళ్లు చెదిరే భవంతులు నిర్మించారు. ఇది దాదాపు 88 డబుల్‌బెడ్‌రూములతో సమానం. లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసంలో 30 గదులు, 14 ఎస్క్‌లేటర్లు, పదుల సంఖ్యలో లిఫ్టులు, ఒక హెలిపాడ్‌, ప్రార్ధనామందిరం, స్క్వాష్‌ కోర్టులు, మినీ థియేటర్లు ఉన్నాయి. ఒక పేదవాడికి ఇది సాధ్యమా అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇన్ని అత్యాధునిక సౌకర్యాలు, విలాసవంతమైన భవంతులతో తులతూగుతున్న జగన్‌, తనకు తాను నిరుపేద అని చేసుకుంటున్న ప్రచారం తిరగబడితే అసలుకే ఎసరు వస్తుందని సొంత పార్టీ సహా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

‘ఒక సింగిల్‌ బెడ్‌రూం దొరికితే అదే మహా భవంతిగా సామాన్య-మధ్య తరగతి వర్గాలు భావిస్తుంటాయి. మరి వందలకోట్ల భవంతులున్న జగన్‌ కూడా నిరుపేదగా భావించుకుంటున్నారు. అది తమను ఎగతాళి చేసినట్లుగానే కిందిస్థాయి వర్గాలు అన్వయించుకుంటే మొత్తం పేద వర్గాలు జగన్‌కు వ్యతిరేకంగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి వ్యాఖ్య ఆయన చేసి ఉండకూడద’ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

jagan00

ఇవి ఓ నిరుపేద నివాసాలు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్  లోని 5807 చదరపు గజాల్లో 88 వేల చదరపు అడుగుల్లో కళ్లు చెదిరే భవంతి ఇది. ఇందులో 30 గదులు, 14 ఎస్క్‌లేటర్లు, పదుల సంఖ్యలో లిఫ్టులు, ఒక హెలిపాడ్గ, ప్రార్ధనా మందిరం, స్క్వాష్‌ కోర్టులు, మినీ థియేటర్లు ఉన్నారుు. అటువైపు బెంగళూరులోని ప్యాలెస్‌. ఇది ేకవలం 5 ఎకరాల్లో ఉంది. దీని విలువ ేకవలం 400 కోట్ల రూపాయలేనట!. 7 అంతస్తు లున్న భవనం మరొకటి. దాని ద్వారా వచ్చే అద్దె ఎంతో తెలుసా.. అది కూడా ేకవలం 27 కోట్ల రూపాయలేనట!! ఇదీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ అనుభవిస్తున్న పేదకులం!!! 

 - (సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌)

Wednesday, May 2, 2012

పేదవారి గురించి తపనే నా కులం : వైఎస్ జగన్



తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఉద్ఘాటన
* ఒక నాయకుడి మతం, కులంపై మాట్లాడే స్థాయికి రాజకీయాలు దిగజారాయి
* పేదలు, రైతులకు అండగా ఉన్నందుకే 17 చోట్ల ఉప ఎన్నికలు
* తన స్వార్థం కోసం చిరంజీవి తిరుపతి ప్రజలను గాలికొదిలేశారు
* ప్రజారాజ్యం పార్టీని హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేశారు
* నన్ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించానంటున్నారు
* సంతకాలు చేయించే ఉంటే.. ఆనాడే చంద్రబాబులా వారిని వైస్రాయ్ హోటల్‌కు తీసుకెళ్లేవాడిని.. సీఎంగా ప్రమాణం చేసేవాణ్ణి
* నేను సీఎం కావాలని ఎవరు సంతకాలు పెట్టించారో చెప్పండి
* నాడు రోశయ్యను సీఎంగా ప్రతిపాదించింది నేను కాదా?


తిరుపతికి గాలేరు-నగరి తెస్తా

‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలాగా.. చనిపోయాక కూడా పేదవాడి గుండెల్లో నిలిచేలా బతకాలన్న తపన, తాపత్రయం నాలో ఉన్నాయి. అందుకే చెబుతున్నా రాబోయే సువర్ణయుగంలో తిరుపతికి గాలేరు-నగరి తెస్తా.. తాగునీటి సమస్య తీరుస్తా’’ - జగన్‌మోహన్‌రెడ్డి


‘గత రెండేళ్లుగా చూస్తున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబుకుగాని, కాంగ్రెస్ పెద్దలకుగాని ప్రజలు, వారి సమస్యలూ కనిపించడం లేదు. రెండేళ్లుగా వీరు చేస్తున్నదేంటంటే.. జగన్‌ను, వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎలా అప్రతిష్టపాలు చేయాలీ.. వారిపై ఎలా బురదజల్లాలీ అని కుట్రలు పన్నడం మాత్రమే. చివరకు వీరు ఏ నీచస్థాయికి దిగజారిపోయారంటే.. జగన్ కులమేంటి? జగన్ మతమేంటి? అని నిస్సిగ్గుగా మాట్లాడే పరిస్థితికి వచ్చేశారు’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. పేదవాడు ఎలా బతుకుతున్నాడు..? వారికి ఎలా మేలు చేయాలీ అన్న ఆలోచనే మానేసి ఇలా దిగజారి మాట్లాడుతున్న చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు తమ వ్యక్తిత్వం గురించి తమను తాము ఒకసారి ప్రశ్నించుకోవాలని ఆయన సూచించారు. ‘‘ఇవాళ చెబుతున్నా.. నా మతం మానవత్వం. నా కులం ప్రతి పేదవాడి గురించి తపించే కులం’’ అని జగన్ ఉద్ఘాటించారు. ఉప ఎన్నికలు జరుగనున్న తిరుపతి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిభూమన కరుణాకరరెడ్డి తరఫున జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రచారం ప్రారంభించారు. ఆయన్ను చూసేందుకు.. చెమటలుకక్కే మండుటెండలో సైతం తిరుపతి రోడ్లపై జనం కిక్కిరిశారు. జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో జగన్ కాన్వాయ్ ముందుకు కదలడం కష్టంగా మారింది. ఆయన ప్రసంగిస్తుంటే.. ఈలలు, తప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. తిమ్మినాయుడు పాళెం పంచాయతీ నుంచి ప్రచారం ప్రారంభించిన జగన్.. తొలిరోజు మొత్తం 13 జంక్షన్లలో ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా మే డే జరుపుకొంటున్న కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేశారు. ఈ పర్యటనలో జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

చిరంజీవి స్వార్థం వల్లే తిరుపతిలో ఉప ఎన్నికలు:
రైతన్నకు, పేదోడికి అండగా నిలబడితే పదవులు పోతాయని తెలిసినా.. నీతి, నిజాయతీతో కూడిన రాజకీయాలు చేసినందుకు 17 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురయ్యారు. అందువల్లే ఆ 17 చోట్ల ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ తిరుపతిలో చిరంజీవి స్వార్థం కోసం ఉప ఎన్నికలు వచ్చాయి. చిరంజీవే స్వయంగా చెప్పారు.. సోనియా గాంధీ ఆయనకు ప్రమోషన్ ఇచ్చారట.. అందుకని ఇక్కడి ప్రజల్ని గాలికొదిలేసి ఆయన రాజ్యసభకు వెళ్తున్నారట. తిరుపతిలో నాలుగురోజులకోసారి నీళ్లు ఇస్తున్నారని, ప్రభుత్వం నీటి ఎద్దడి పరిష్కరించలేదని చిరంజీవి రాజీనామా చేసుంటే సంతోషించేవాళ్లం. ఆయనకు నేను కూడా సెల్యూట్ చేసి ఉండేవాణ్ణి. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కుదించారని, 108కు ఫోన్ చేసినా వాహనం వచ్చే పరిస్థితి లేదని రాజీనామా చేసుంటే అభినందించేవాళ్లం. రంగారెడ్డి జిల్లాకు చెందిన వరలక్ష్మి లాంటి పేద అమ్మాయి చదువుకోలేక, ఫీజు కట్టలేక ఆత్మహత్యకు పాల్పడింది. అలాంటి వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని రాజీనామా చేసుంటే గర్వపడుండేవాళ్లం. పదవి కోసం, కావాల్సిన వారికి మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు చిరంజీవి హోల్‌సేల్‌గా తన పార్టీని కాంగ్రెస్‌కు అమ్ముకున్నారు. ఇప్పుడు చెప్పండి స్వార్థపరుడు చిరంజీవా, నేనా?

చిరంజీవి ఎప్పుడూ నాపై నింద వేస్తూనే ఉన్నారు:
చిరంజీవి మాటిమాటికీ నా మీద ఏదో ఒక నింద వేస్తూనే ఉన్నారు. ఆ వేళ నాన్న చనిపోయినప్పుడు.. నన్ను సీఎంగా చెయ్యాలంటూ 150 మందికిపైగా ఎమ్మెల్యేలతో నేను సంతకాలు చేయించానని అంటున్నారాయన. ఆ 150 మందికిపైగా ఎమ్మెల్యేల్లో కొంతమంది చిరంజీవి వద్దకు బహిరంగంగా అందరికీ తెలిసేటట్లుగా వెళ్లి.. వాళ్లందరినీ(పీఆర్‌పీ ఎమ్మెల్యేలందరినీ) నాకు మద్దతు తెలపాలని అడిగినట్లు చిరంజీవి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దీనిపై చిరంజీవిని మా పార్టీ వాళ్లు చాలాసార్లు ఎదురు ప్రశ్నించారు. ఆయన వద్దకు వచ్చిన వారెవరో చెప్పాలని పదే పదే అడిగారు. ‘సాక్షి’లో కూడా చాలాసార్లు ఈ విషయాన్ని వేస్తూ వచ్చారు. అయితే ఆ ప్రశ్నలకు చిరంజీవి సమాధానం చెప్పలేదు. ఇప్పుడేమో బాబు కూడా చిరంజీవి మాటే మాట్లాడుతున్నారు.

కొంచెమైనా జ్ఞానముందా చిరంజీవీ?: 
నన్ను సీఎంగా చేయాలని 150 మందికిపైగా ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించే దుర్బుద్ధే నాకు ఉంటే.. చంద్రబాబు నాయుడిలా వాళ్లందరినీ ఆ నాడే వైస్రాయ్ హోటల్‌కు తీసుకెళ్లిపోయేవాణ్ణి.. ఆ వెంటనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేవాణ్ణి. అయ్యా చంద్రబాబూ.. ఆ రోజు ఎవరు సంతకాలు చేయించారో నాకు తెలీదు. మీకు తెలిస్తే మీరైనా చెబితే సంతోషిస్తాను. అయ్యా చిరంజీవిగారూ.. కొంతమంది ఎమ్మెల్యేలను మీ వద్దకు పంపించి మద్దతు కోరానని మీరు చాలాసార్లు అన్నారు. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నాకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలను మీ దగ్గరకు అలా బహిరంగంగా పంపించానని సోనియాకు తెలిస్తే.. నన్ను ఎలా సీఎం చేస్తారయ్యా? నీకు కొంచెమైనా జ్ఞానముండాలి కదయ్యా చిరంజీవి ఆ మాట మాట్లాడ్డానికి.

ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎంనవుతా: 
చంద్రబాబుకు, చిరంజీవికి ఇద్దరికీ చెప్తున్నా.. మీ మాదిరిగా నేను అధికారం కోసం ఏ గడ్డయినా తినేవాణ్ణికాదు. అధికారం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచే చరిత్ర నాకు లేదు చంద్రబాబూ! ఓటేసిన 70 లక్షల మంది ప్రజల్నీ స్వార్థం కోసం నట్టేట ముంచిన చరిత్ర నాదికాదయ్యా చిరంజీవి.. అది నీదేనయ్యా. అధికారం అనేది దేవుడు నా నుదుట రాసిపెడితే.. అదెలా ఉంటుందీ అంటే.. పేదవాడి కొరకు, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎంగా నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. నా నైజం, నా గుణగణాలు ఇవే. ఈ మాదిరిగా నేను సీఎం అవుతానేకాని... మీలాగా దొడ్డిదారిన పదవి చేపట్టాలని తాపత్రయపడను. ఇవాళ చంద్రబాబును నేను ఒక్క మాట అడుగుతున్నా.. ఆ వేళ నేనే కదయ్యా రోశయ్యను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిందీ అని అడుగుతున్నా.

అందరూ ఒక్కటై దాడి చేస్తున్నారు:
  ఇవాళ అధికారం కోసం వెంపర్లాడుతూ నా మీద రోజుకో మాట మాట్లాడుతున్నారు. రోజుకో నింద వేస్తున్నారు. నన్ను ఒక్కడిని చేశారు. అటు సోనియా గాంధీ వైపు నుంచి కాంగ్రెస్‌వాళ్లు, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ కాంగ్రెస్ వాళ్లతో కలిసి దాడి చేస్తున్నారు. వాళ్ల దగ్గర అధికారం ఉంది. వాళ్ల దగ్గర ఉన్న వ్యవస్థలను అడ్డగోలుగా నా మీదకు ఉసిగొల్పుతున్నారు. మరోవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 అంతా కలిసి దాడి చేస్తున్నారు.. నన్ను ఒక్కడిని చేసి వీరందరూ ఒక్కటై దాడి చేస్తున్నారు. రోజుకో కట్టు కథ.. రోజుకో అబద్ధం. రోజూ చెప్పిందే చెప్పి దుష్ర్పచారం చేసి ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తున్నారు. నన్ను ఒక్కడిని చేసి మీరంతా ఏకం కావచ్చు. నా దగ్గర రాజ్యాలు లేకపోవచ్చు.. మద్దతిచ్చే రాజులు లేకపోవచ్చు.. నా దగ్గర గుర్రాలు లేకపోవచ్చు. కానీ పై నుంచి ఆ దేవుని ఆశీస్సులు, నాన్నను ప్రేమించే ప్రతి గుండే నా వెంటే ఉందని చెప్తున్నా.

మీ ఓటు మార్పునకు నాంది:
త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పేదవాడు, రైతు ఓ వైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉండి పోటీ పడుతున్నాయి. మీరు వేసే ఓటుతో ఈ రాష్ట్రాన్ని రిమోట్‌తో పాలిస్తున్న ఢిల్లీ పాలకుల దిమ్మ తిరగాలి. మీరు వేసే ఓటు రాష్ట్రంలో మార్పు తేవాలి. ఆ మార్పుతో రాష్ట్రంలో త్వరలో మళ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు సువర్ణయుగం వస్తుంది. ప్రతి అక్క, అన్న.. తమ తమ్ముడు సీఎం అయ్యాడని, ప్రతి చెల్లెలు, ప్రతి తమ్ముడు తమ అన్న సీఎం అయ్యాడని.. ప్రతి అవ్వా, తాత తమ మనవడు సీఎం అయ్యాడని అనుకునే విధంగా, ప్రతి రైతు, పేదవాడు కాలర్ ఎగరేసేలా ఆ సువర్ణయుగం ఉంటుంది. ఏటా పేదలకు 10 లక్షల ఇళ్లు కట్టించే విధంగా పాలన ఉంటుంది.