Tuesday, January 25, 2011

జగన్‌ సరెం‘డర్‌’ ! ‘దేశం’, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్!

Jagan-sad
కాంగ్రెస్‌ పార్టీతో సయోధ్యకు జగన్‌ ప్రయత్ని స్తున్నారా? వారిద్దరూ ఇప్పటికే ఒక అవగా హనతో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారా? కేసులు, బెదిరింపులకు జగన్‌ తాళలేక అధిష్ఠానానికి సరెండర్‌ కానున్నారా? ఆ మేరకు జగన్‌ మరికొద్దిరోజుల తర్వాత కాంగ్రెస్‌ గూటిలో ఒదిగిపోనున్నారా? ప్రస్తుతం జగన్‌ ఓదార్పు పర్యటనలు భవిష్యత్తులో కోస్తాలో టీడీపీని ఎదగ నీయకుండా చేస్తున్న ఎత్తుగడలో భాగమా? జగన్‌-కాంగ్రెస్‌ పార్టీ మధ్య సయోధ్య కుదురుతుందన్న భయంతోనే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి జగన్‌పై హటాత్తుగా ఎదురుదాడి తీవ్రత పెంచారా? ఈ పరిణామాల నేపథ్యంలో అసలు జ గన్‌ పార్టీ పెడతారా? లేక పార్టీ స్థాపించి, శరద్‌పవార్‌ మాదిరిగా కాంగ్రెస్‌తో కలసి పని చేస్తారా?...జగన్‌కు అత్యం సన్నిహితుడయిన అనకా పల్లి కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి తాజాగా చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ఈ అను మానాలకు తెరలేచింది.

కాంగ్రెస్‌ పార్టీ జగన్‌తో సయోధ్య కుదుర్చుకునే వాతా వరణం ఉండగా, దానిని చెడగొట్టేందుకు ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న సబ్బం హరి వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో సంచలనానికి, సరికొత్త చర్చకు దారితీశాయి. జగన్‌ను తిరిగి కాంగ్రెస్‌లో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగు తున్న సమయంలో సీఎం వ్యాఖ్యలు సరైనవి కావని సబ్బం హరి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్‌ పక్కనే ఉంటూ ఆయనకు గట్టి మద్దతుదారుగా వ్యవహరిస్తున్న సబ్బం హరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తేలిగ్గా కొట్టివేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్‌ ఎత్తుగడలు, ఆలోచనల్లో భాగస్వామి అయిన సబ్బం హరి, ఎలాంటి దాపరికం లేకుండాకాంగ్రెస్‌ పార్టీ జగన్‌తో సయోధ్యకు ప్రయత్నిస్తోందన్న వ్యాఖ్యల్లో నిజం ఉండి తీరుతుందని పార్టీ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.

అయితే, కాంగ్రెస్‌ జగన్‌తో సయోధ్యకు ప్రయత్నిస్తోందన్న దానికన్నా జగనే కాంగ్రెస్‌కు సరెండరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవలసి ఉంటుందని కాంగ్రెస్‌ సీనియర్లు చెబుతున్నారు.జగన్‌ కూడా సయోధ్యకు సుముఖంగానే ఉన్నారన్న భావన సబ్బం మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్‌- కాంగ్రెస్‌ సయోధ్య ప్రయత్నాలు జరుగుతుంటే సీఎం కిరణ్‌ దానిని చెడగొడుతున్నారని జగన్‌ వర్గీయుడయిన సబ్బం చెప్పారంటే.. జగన్‌ కూడా సయోధ్యకు సిద్ధంగానే ఉన్నారన్న వాస్తవం స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు. ‘ఒక వ్యక్తి తమ మధ్య సయోధ్య కుదురే సమయంలో అవతల వ్యక్తి వచ్చి దానిని చెడగొడుతు న్నారని ఆరోపించారంటే, ఇవతల వ్యక్తికి కూడా ఎదుటివారితో సయోధ్య కుదుర్చు కోవాలన్న కోరిక ఉన్నట్లే లెక్క. లేకపోతే మధ్యలో వచ్చిన వ్యక్తిని చెడగొడుతున్నారంటూ విమర్శించవలసిన పనిలేద’ని ఒక సీనియర్‌ నేత విశ్లేషించారు. ఒకరకంగా సబ్బం వ్యాఖ్యలు ఆయన ఆవేదన, ఆందోళనను సూచిస్తున్నాయంటున్నారు.

జగన్‌కు సంబంధించిన ఆస్తులు, అనుచరులపై కేసులు, ఆయనకు సన్నిహితుడైన గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓఎంసీ గనులు సీజ్‌ చేయాలన్న సిఫార్సులు, తాజాగా సాక్షి పెట్టుబడులపై హైకోర్టు నోటీసుల వ్యవహారం అంతా జగన్‌ను లొంగదీసుకునే రాజకీయ ఎత్తగడగానే భావిస్తున్నారు. ఈ క్రమంలో తాను పార్టీ పెడితే ఇంకా తనపై, తన మద్దతుదారులపై వేధింపులు పెరుగుతాయన్న ఆందోళన జగన్‌లో లేకపోలేదంటు న్నారు. రాజశేఖరరెడ్డి మాదిరిగా వాటిని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి, నేర్పు, వ్యూహం జగన్‌కు లేనందున, అధిష్ఠానంతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని జగన్‌ ఇప్పటికే గ్రహించారని చెబుతున్నారు.

ప్రధానంగా.. వ్యాపారస్తుడైన జగన్‌ కేంద్రంతో శత్రుత్వం తెచ్చుకుని ఆర్థికంగా నష్టపోవడానికి సిద్ధపడరని ఆయన అనుచరులు సైతం చెబుతున్నారు. తన సంపదను రక్షించుకునేందుకయినా ఆయన కాంగ్రెస్‌తో సయోధ్య కుదుర్చుకోవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్‌తో సయోధ్య వాతావార ణాన్ని కిరణ్‌ చెడగొడుతున్నా రని సబ్బం చేసిన వ్యాఖ్యను బట్టి.. జగన్‌ కాంగ్రెస్‌తో రాజీకి సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతూనే ఉంది. అటు మంత్రి శంకర్‌రావు కూడా జగన్‌ మళ్లీ కాంగ్రెస్‌ తలుపు తడతారని జోస్యం చెప్పారు. చిన్నాయన వైఎస్‌ వివేకానందరెడ్డి కూడా జగన్‌ మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వీటిని కొట్టిపారేసే అంశాలు కావంటున్నారు.

అయితే, నిజంగా కాంగ్రెస్‌తో సయోధ్య వాతావరణం ఉంటే మరి జగన్‌ పార్టీ పెడతారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే మన పార్టీ వస్తోందని, మూడేళ్లు కష్టపడితే ఆ తర్వాత సుఖపడవచ్చని జగన్‌ స్వయంగా చెప్పారు. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాననీ ప్ర టించారు. ఫిబ్రవరిలో పార్టీ పెడతారంటూ ఎంపీ మేకపాటి, అంబటి రాంబాబు ఇప్పటికే ప్రకటించారు. జిల్లాల్లో ఓదార్పు యాత్రలు, ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు ఇప్పటికే కోట్లాది రూపాయలు కుమ్మరించారన్న ప్రచారం జరుగుతోంది. మరి కాంగ్రెస్‌తో సయోధ్య కుదిరితే జగన్‌ పార్టీ స్థాపన యత్నాన్ని విరమించుకుంటారా అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.

జగన్‌ మనస్తత్వం తెలిసిన ఆయన వర్గీయులు మాత్రం జగన్‌ రాజకీయ పార్టీ స్థాపించడం ఖాయమని, చెప్పింది చేయడం ఆయన నైజమని గుర్తు చేస్తున్నారు. అయితే, పార్టీ స్థాపించిన తర్వాత కాంగ్రెస్‌కు దగ్గరయి, మహారాష్టల్రో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ మాదిరిగా కాంగ్రెస్‌తో కలసి పనిచేసే అవకాశాలుంటాయని వివరిస్తున్నాయి. ఆలోగా, కోస్తాలో తెలుగుదేశం పార్టీని బలహీనం చేసేందుకు జగన్‌ ప్రయత్నించవచ్చని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌-జగన్‌ పార్టీ కలసి పనిచేసినా ఆశ్చర్యపడవలసిన అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఆ విధంగా జరిగినా జగన్‌ కాంగ్రెస్‌కు సరెండర్‌ అయినట్లేనని స్పష్టం చేస్తున్నారు.

ఇదిలాఉండగా.. జగన్‌-కాంగ్రెస్‌ మధ్య సయోధ్య వాతావరణం మొదలయిందన్న వాస్తవం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సైతం తెలుసనని సబ్బం హరి వ్యాఖ్యలో స్పష్టమవుతోంది. ఇటీవలి కాలంలో ప్రణబ్‌-ఆంటోనీ-మొయిలీని తరచూ కలుస్తున్న సబ్బం హరి ఇలాంటి వ్యాఖ్యలు ఊరకనే చేసి ఉండరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఆ విషయం ముఖ్యమంత్రికి సైతం తెలుసునని హరి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్‌ హటాత్తుగా జగన్‌పై ఎదురుదాడి చేయడం, జగన్‌ను నైతికంగా-మానసికంగా దెబ్బతీసే ప్రకటనలు చేస్తుండటంతో సయోధ్య వాతావరణం దెబ్బతింటోందని సబ్బం ఆందోళన చెందుతున్నట్లు ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయి.

కిరణ్‌ హటాత్తుగా జగన్‌పై ఎదురుదాడి చేస్తుండటంతో సయోధ్య వాతావరణం చెడి పోయి జగన్‌ ఎక్కడ కాంగ్రెస్‌కు కాకుండా పోతారేమోనన్న భయాందోళన హరి మాట ల్లో కనిపిస్తోంది. జగన్‌ను కాంగ్రెస్‌లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయం గా సబ్బంహరి ప్రకటించినందున, దానిని నిజమని భావించక తప్పదంటున్నారు. హరి మాటలు నిజమయితే.. జగన్‌ను తిరిగి పార్టీలోకి రాకుండా కిరణ్‌ అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారని భావించవలసి వస్తోంది.

sabbam-hari2 

జగన్‌ తిరిగి పార్టీలోకి వస్తే అది తన భవితవ్యానికే ప్రమాదమన్న ముందు జాగ్రత్తతోనే కిరణ్‌ జగన్‌పై మాటల దాడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. జగన్‌ పార్టీ గడప తొక్కితే తన పదవికే ఎసరు వస్తుందని కిరణ్‌ భావించడం సహజమంటున్నారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఎప్పుడూ జగన్‌ ప్రస్తావన తీసుకురాని కిరణ్‌, హటాత్తుగా తన ఢిల్లీ పర్యటన నుంచి మాటల దాడి ప్రారంభించారంటే.. జగన్‌ను మళ్లీ పార్టీ గడపతొక్కకుండా చేసే వ్యూహంలో భాగమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

జగన్‌కు, కాంగ్రెస్‌ పార్టీకిమధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతుండగా వాటిని చెడగొట్టడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. జగన్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. ఆయన నోరు పారేసుకుంటే చరిత్ర విప్పాల్సి ఉంటుంది
- సబ్బం హరి, అనకాపల్లి ఎంపీ

జగన్ వర్సెస్ కిరణ్
కత్తులు నూరుతున్న టీడీపీ, టీఆర్ఎస్
రసపట్టులో మాట.. రాజకీయం ఆట

యువనేత వర్గంపై కిరణ్ 'మైండ్ గేమ్'
ప్యూహాత్మకంగానే పరిటాల కేసు ప్రస్తావన
కిరణ్ '60 రోజుల కష్టం'పై టీడీపీ ధ్వజం
ముఖ్యమంత్రి కూడా నేరస్తుడే: చంద్రబాబు
సీబీఐ విచారణ జరిపించాలి: యనమల
ముఖ్యమంత్రిపైనా కేసు పెట్టాలి: పయ్యావుల
ఈ కష్టం దోషులను రక్షించేందుకే: దాడి
మా పోరాటం ఫలిస్తోంది: రేవంత్
ఇంటర్‌పోల్‌తో ఆరా తీయాలి: దేవినేని ఉమ
జగన్, కిరణ్‌లపై విచారణ: టీఆర్ఎస్ నేత హరీశ్
కిరణ్ మాటలపై జగన్ వర్గం ఎదురు దాడి
ప్రమాదం గురించి ముందే తెలుసా: జూపూడి
సంప్రదింపులు ఆపేందుకే ఆరోపణలు: సబ్బం హరి
హైదరాబాద్, జనవరి 25 : 'ఆట' మొదలైంది! రాజకీయ చదరంగం రసకందాయంలో పడింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఈ ఆటలో పోటీ పడుతున్నాయి. ఒకరిని ఒకరు ఇరుకున పెట్టేందుకు... పాత పాపాలను తవ్వి పోసేందుకు... అందరూ అస్త్రాలు పట్టుకుని బయలుదేరారు. ఎవరి మాటలను వారి మెడకే చుట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఆరేళ్లు అధికారంతో ఆటాడుకున్న మాజీ ఎంపీ వైఎస్ జగన్‌పై కాంగ్రెస్, టీడీపీలతోపాటు టీఆర్ఎస్ కూడా కత్తులు దూస్తోంది. జగన్ మీడియాలో పెట్టుబడులు పెట్టిన వారికి జారీ చేసిన నోటీసులే వీరికి అస్త్రాలుగా మారాయి. 'ఓ ఖూనీ కేసులో జగన్‌ను అసెంబ్లీలో కాపాడేందుకు 60 రోజులు అధ్యయనం చేశాను' అని ప్రకటిస్తూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'మైండ్ గేమ్'కు శ్రీకారం చుట్టారు.

బహుశా... 'పరిటాల రవి హత్య కేసులో నువ్వో నిందితుడివి. చేసిన మేలు మరిచిన కృతఘ్నుడివి' అని జగన్‌కు చెప్పడమే ముఖ్యమంత్రి అంతరంగం కావొచ్చు. అంతేకాదు... వైఎస్ తనకొక పని చెప్పారని, అది అనైతికమని తాను చెప్పానని, ఆ కారణంగానే తాను 'సెప్టెంబర్ 2'న వైఎస్‌తోపాటు హెలికాప్టర్‌లో రచ్చబండకు వెళ్లలేదని కూడా చెప్పారు. తద్వారా... తాను నైతికతకు కట్టుబడి ఉన్న వ్యక్తిని అనే సంకేతాలు పంపారు. స్పీకర్‌గా ఉన్న తన చేత అనైతిక ప్రకటనలు చేయించేందుకు వైఎస్ ప్రయత్నించారని చెప్పకనే చెప్పారు.

అయితే... ఇవే ప్రకటనలు అటు తెలుగుదేశం, ఇటు జగన్ వర్గం నేతలకు అస్త్రాలుగా మారాయి. 'చీఫ్ విప్‌గా ఉన్న కిరణ్ ఒక ముద్దాయిని కాపాడారు' అంటూ తెలుగుదేశం మండిపడగా... వైఎస్ ప్రమాదం వెనుక ఉన్న అనుమానాలకు కిరణ్ ప్రకటన బలం చేకూరుస్తోందని జగన్ వర్గం నేతలు పేర్కొన్నారు. పరిటాల హత్య, వైఎస్ దుర్మరణం... ఈ రెండు కేసుల్లో సీబీఐ కిరణ్‌ను కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.

ఈ అంశాలను పక్కన పెడితే... అధికారమే రక్షణ కవచంగా జగన్ అడ్డగోలుగా సాగించిన అక్రమాలు ఇప్పుడు మరింత తేటతెల్లమవుతున్నాయి. వీటిపై కాంగ్రెస్, టీడీపీలు గురిపెట్టాయి. "వైఎస్ అధికారంలోకి వచ్చింది మొదలు... అవిశ్రాంతంగా చేసిన దోపిడీ న్యాయ దేవత సాక్షిగా బట్టబయలు కానుంది'' అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రికాక మునుపు, ఎమ్మెల్యే హోదాలో శంకర్ రావు రాసిన లేఖలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించడంతో 'జగన్ ఆస్తుల తుట్టె' మరోమారు కదిలింది.

దీనిపై శంకర్‌రావు మంగళవారం మీడియాతో మాట్లాడారు. 'అధికార దుర్వినియోగంతోనే జగన్ సొంత మీడియాను ఏర్పాటు చేసుకున్నారు' అని తెలిపారు. "వైఎస్ చచ్చి బతికారు. లేకపోతే, అవినీతి ఆరోపణలు పెరిగి అనునిత్యం చచ్చేవారు... అని ఒక పెద్దాయన గతంలో అన్నారు. జగన్ అవినీతిపై వాస్తవాలు బహిర్గతమయ్యేందుకే హైకోర్టుకు లేఖ రాశాను'' అని తెలిపారు. ఇక జగన్ మీడియాతోపాటు, ఆయన అక్రమ ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని... దీనిపై సీబీఐ విచారణ జరపాలని మరో మంతి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.

డబ్బుకు ప్రాధాన్యమిచ్చే జగన్ ముఖ్యమంత్రి అయితే... ఇక రాష్ట్రమే ఉండకపోవచ్చునని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. 'సాక్షి' అక్రమార్జనతోనే పుట్టిందని.. జగన్ వర్గానికి సిగ్గూ లజ్జా లేవని ఎంపీ మధుయాష్కీ విరుచుకుపడ్డారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో నేతల మధ్య చర్చ మొత్తం జగన్ ఆస్తుల చుట్టూ తిరిగింది. "అప్పట్లో మేం వైఎస్ మాటను జవదాటలేని పరిస్థితి ఉండేది.

పత్రికల్లో అవినీతి బాగోతాల గురించి కథనాలు వచ్చినా స్పందించలేని స్థితి. వైఎస్ మరణం తర్వాత కూడా జగన్‌పై విమర్శలు చేసేందుకు వెనుకాడాం. కానీ, నిజం నిప్పులాంటిది. ఏదో ఒకరూపంలో బయటకు వస్తుంది'' అని ఒక ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారమనే ఉల్లిపొర తొలగిపోవడం, రాజకీయ పరిస్థితులు మారడంతో జగన్ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని... ఇప్పుడు ప్రభుత్వం కూడా వాటిని కప్పి పుచ్చలేదని అంటున్నారు.

మరో పోరాటం...

వైఎస్ ఉండగా... ఆయన అవినీతిపై అవిశ్రాంతంగా చేసిన పోరాటానికి ఇప్పుడు ఫలితం లభిస్తోందని ఆనందిస్తోంది. అటు కిరణ్‌పై, ఇటు జగన్‌పై అస్త్రాలు సంధిస్తోంది. పరిటాల కేసులో నిందితులను కాపాడటంలో తాను చొరవ చూపినట్లు ముఖ్యమంత్రి అంగీకరించడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నేరస్తులను కాపాడిన సీఎం కూడా నేరస్తుడే అన్నారు. జగన్ మీడియాలో పెట్టుబడులపై హైకోర్టు స్వీకరించిన రిట్ పిటిషన్‌లో తెలుగుదేశం సైతం ఇంప్లీడ్‌గా చేరాలని టీడీపీ భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు.

పరిటాల హత్యపై సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో... సీబీఐ పునర్‌విచారణ జరపాలని డిమాండ్ చేశారు. "జగన్‌ను వెనుకేసుకు రావడానికి 60 రోజులు కష్టపడ్డామని చెప్పడమంటే... హత్యానేరాలను ప్రోత్సహించడమే. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని కేసు నమోదు చేయాలి'' అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. "చీఫ్ విప్ పదవిలో ఉండి నేరస్తులను రక్షించడం చట్ట విరుద్ధం కాదా? వాస్తవాలను దాచేందుకే 60 రోజులు కష్టపడ్డారా?'' అని ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం సంపాదించిన అవినీతి సొమ్ముఉన ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.

జగన్ అవినీతిపై ఆరేళ్లుగా తాము చేస్తున్న పోరాటానికి ఫలితం లభిస్తోందని మరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జగన్ ఆస్తులపై ఇంటర్‌పోల్ సహాయంతో ఆరా తీయాలని, వైఎస్ హయాంలో లక్ష కోట్ల అవినీతి జరిగినట్లు తాము ఆధారాలతో సహా బయటపెట్టామని ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు. టీఆర్ఎస్ నేత హరీశ్ రావు అటు జగన్, ఇటు కిరణ్‌లపై ఎక్కుపెట్టారు. హత్యానేరం నుంచి జగన్‌ను కాపాడినట్లు ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకొన్నందున... హైకోర్టు దీనిని సుమోటోగా తీసుకుని కిరణ్, జగన్‌లపై విచారణ జరపాలన్నారు.

కిరణ్ మైండ్ గేమ్

విచ్చలవిడిగా చెలరేగిపోతున్న జగన్ వర్గాన్ని ఆత్మ రక్షణలోకి నెట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ 'మైండ్‌గేమ్' మొదలుపెట్టినట్లు భావిస్తున్నారు. పరిటాల రవి హత్య కేసును, 2009 సెప్టెంబర్ 2న రచ్చబండకు వెళ్లేముందు వైఎస్ ఒక అనైతిక పని తనకు చెప్పారనడం వంటి అంశాలను ఆయన బహిరంగంగా ప్రస్తావించడం సంచలనం సృష్టించింది. సాధారణంగా కిరణ్ నోరు జారరని... విశాఖలో కార్యకర్తల సమావేశంలో ఆయన వ్యూహాత్మకంగానే మాట్లాడారని అంటున్నారు.

పరిటాల రవి హత్య కేసులో జగన్‌పై అనుమానాలున్నాయని చెప్పడం ఒక ఎత్తయితే... వైఎస్ తన చేత అనైతిక పనులు చేయించాలని చూశారని చెప్పడం మరో ఎత్తు. విషయం లోతుల్లోకి వెళ్లకుండానే చెప్పాల్సింది చెప్పి, తన చతురత ప్రదర్శించినట్లు కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటన నాటి నుంచి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిలో మార్పు స్పష్టంగా కన్పిస్తోందని వారంటున్నారు. అయితే... ఇందులో వ్యూహాత్మకమేమీ లేదని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే తాను అలా మాట్లాడానని కిరణ్ తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం.

జగన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తుతున్నారు. ఇదే స్ఫూర్తితో ఆయన వర్గీయులూ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ... కాంగ్రెస్ వైపు నుంచి ఆ స్థాయిలో ఎదురు దాడి కనిపించడంలేదు. ముఖ్యమంత్రి కిరణ్ నుంచి కూడా స్పందన లేకపోవడంతో కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి.

"జగన్‌ను, ఆయన వర్గాన్ని ఏ స్థాయిలో ఎదుర్కోవాలో, అసలు ఎదుర్కోవాలో వద్దో అనే అయోమయం కూడా ఉంది. దీనిని తొలగించి, ఎదురుదాడికి సిద్ధం చేయడమే నా ఉద్దేశం'' అని కిరణ్ చెబుతున్నట్లు సమాచారం. ఇకపై... సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారీ వైఎస్‌కు తామే సన్నిహితులమని, జగన్ కంటే తమకే ఆయన అధిక ప్రాధాన్యమిచ్చే వారని, ఆయన రాజకీయ వారసులం తామేనని చాటి చెప్పనున్నట్లు తెలుస్తోంది.

జగన్ వర్గం ఫైర్

హెలికాప్టర్ ప్రమాదం గురించి కిరణ్ ఏ ఉద్దేశంతో ప్రస్తావించినప్పటికీ... జగన్ వర్గం మాత్రం ఇదే ప్రకటనను తమకు అస్త్రంగా మార్చుకుంటోంది. 'వైఎస్ మరణించనున్నట్లు తెలిసే... కిరణ్ తన ప్రయాణాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారా?' అని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు ప్రశ్నించారు. పరిటాల హత్య కేసు గురించి ప్రస్తావించడం కిరణ్ అభద్రతా భావానికి నిదర్శనమన్నారు.

అంబటి రాంబాబు కూడా హెలికాప్టర్ ప్రమాదంపై ఇదే సందేహాలు వ్యక్తం చేశారు. సీబీఐ కిరణ్‌ను కూడా ప్రశ్నించాలన్నారు. పరిటాల కేసులో జగన్‌ను నిందితుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక ఎంపీ సబ్బం హరి సంచలన ఆరోపణలు చేశారు. స్పీకర్‌గా ఉండగానే ముఖ్యమంత్రి పదవి కోసం కిరణ్ చేసిన ప్రయత్నాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. జగన్‌తో అధిష్ఠానం జరుపుతున్న సంప్రదింపులను అడ్డుకునేందుకే... వైఎస్ కుటుంబంపై కిరణ్ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. 
Click Here!
 కాంగ్రెస్‌ది నీచ రాజకీయం
రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ కుటుంబాన్ని చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకాడలేదు.
పులివెందులలో వైఎస్ జగన్ ధ్వజం
హామీల అమలేదని అడిగితే ఇప్పుడు ఎన్నికలు లేవంటోంది
మహానేత భార్యపై ఆయన తమ్ముడినే పోటీకి దించుతోంది
సొంతగడ్డపై జగన్‌కు పల్లెపల్లెనా వెల్లువెత్తిన అభిమానం
నానమ్మ జయమ్మకు యువనేత నివాళి

‘రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ కుటుంబాన్ని చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకాడలేదు. అంతటితో సంతోషించకుండా, ఆ మహానేత సతీమణిపై ఆయన తమ్ముడినే పోటీ పెట్టించే నీచ రాజకీయానికి కాంగ్రెస్ దిగింది. ప్రతి అక్కా, ప్రతి చెల్లీ.. ఓటు వేసే ముందు ఈ నీచ రాజకీయాలను గుర్తించండి’ అంటూ యువనేత వైఎస్ జగన్ తన సొంతగడ్డ పులివెందుల ప్రజలకు పిలుపునిచ్చారు. ‘వైఎస్ హామీ ఇచ్చిన 30 కిలోల బియ్యం, 9 గంటల ఉచిత విద్యుత్‌ను ఎందుకు అమలు చేయలేదని ఈ కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తే, ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, ఎన్నికలు దగ్గర పడిన తర్వాత ఇస్తాం’ అంటోందని కాంగ్రెస్ అవకాశవాదాన్ని ఎత్తిపొడిచారు. యువనేత మంగళవారం ఉదయం పులివెందులకు చేరుకున్నారు. నానమ్మ జయమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె సమాధి వద్ద నివాళులు అర్పించారు. విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో ఫాదర్ల సమక్షంలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు తనను కలిసేందుకు వచ్చిన వారిని విడివిడిగా కలిసి మాట్లాడారు. అనంతరం తొండూరు మండలంలోని గంగాదేవిపల్లె, ఉడవగండ్ల, ఇనగలూరు, అగడూరు గ్రామాల్లో యువనేత పర్యటించారు. గంగాదేవిపల్లె, అగడూరు గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. వైఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ.. ఆయన చేసిన ప్రసంగం వారిని ఉత్తేజితులను చేసింది. రాష్ట్రంలోని ప్రతి పేదకూ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు అమలుచేసి వైఎస్ జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.

పల్లెపల్లెనా కురిసిన అభిమానం


తొండూరు మండలంలో యువనేత పర్యటించిన గంగాదేవిపల్లె, ఉడవగండ్ల, ఇనగలూరు, అగడూరు గ్రామాల్లో గ్రామస్థులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. డప్పులు, బాణసంచాలతో ఘనస్వాగతం పలికారు. ఊళ్లోకి ప్రవేశించగానే అక్కడి నుంచి డప్పుల మోతలతో, బాణసంచా కాల్పులతో ఊరేగింపుతో గ్రామంలోకి తీసుకెళ్లారు. వృద్ధులు, మహిళలు, యువకులు ఆయనను చూసేందుకు అమితాసక్తి చూపారు.


చర్నాకోల పట్టి: ఇనగలూరు గ్రామానికి చేరే ముందు జగన్‌ను వాహనం నుంచి దిగాలని గ్రామస్థులు ఒత్తిడి చేశారు. తాము అలంకరించి తెచ్చిన కోడెడ్ల బండిలో ఆయన్నుఎక్కించారు. యువనేత చర్నాకోల పట్టి, మరో చేత పగ్గాలు పట్టి కోడెలను పరుగెత్తించారు. బండి వెంట యువకులు ఈలలు, కేకలు వేస్తూ అనుసరించారు. ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి ప్రవేశించేంత వరకు యువనేత ఇలా ఎద్దుల బండిలో చర్నాకోల తిప్పుతూ రావడం గ్రామస్తులను అబ్బురపరిచింది. అగడూరులోనూ గ్రామస్థుల కోరిక మేరకు ఆయన ఎడ్లబండి తోలారు.

Click Here!

 ఔను.. వీళ్లిద్దరూ ఇష్టపడ్డారు
‘దేశం’, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్!
* బలం లేదని తెలిసినా గతంలో అవిశ్వాస తీర్మానం
* ఇప్పుడు అవకాశమున్నా ముందుకు రాని టీడీపీ
* ఇతర విపక్షాలు బాధ్యతలు గుర్తుచేస్తున్నా పట్టించుకోని వైనం
* జగన్‌కు లభిస్తున్న ప్రజాస్పందనతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో వణుకు
* ఎన్నికలంటూ వస్తే పరాజయం తప్పదనే ఇరుపార్టీల్లో భయం
* అందుకే శత్రుత్వాలను సైతం పక్కనబెట్టి యువనేతను ఎదుర్కొనేందుకు కుట్రలు
* సాక్షిలో పెట్టుబడులపై ఆరోపణలు, హైకోర్టుకు లేఖలు అందులో భాగమే
* పార్టీల ప్రయోజనాలకన్నా జగన్‌ను దెబ్బతీయడమే లక్ష్యం

ఇంతటి అవకాశవాద రాజకీయాలను ఎన్నడూ చూడలేదు... నిన్నటివరకు కత్తులు దూసుకున్న వారే నేడు చాటుగా కౌగిలించుకుంటున్నారు... రాజకీయ శత్రుత్వాన్ని మరచి ఏకమవుతున్నారు... వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీల ప్రయోజనాలను సైతం పణంగా పెడుతున్నారు... జనబలం ఉన్న నేతను నేరుగా ఎదుర్కొనే చేవలేక కుయుక్తులు పన్నుతున్నారు... ప్రత్యర్థులమన్న సోయికూడా మరచి కుట్రలు చేస్తున్నారు... రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చూడని రాజకీయాలివి... ఇవీ రాష్ట్రంలోని ఆయా రాజకీయ పార్టీల్లోని పలువురు నేతల ప్రైవేటు సంభాషణల్లో వినిపిస్తున్న వ్యాఖ్యలు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎప్పుడేం గండం వస్తుందోననే భయంతో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని ఢిల్లీ పిలిపించుకుని మంతనాలు జరిపిన రోజునుంచి రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రం మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కడిని, ఒకే ఒక్కడిని ఎదుర్కొనేందుకు తమ శత్రుత్వాలను సైతం పక్కనబెట్టి, అందరూ కలిసి కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జగన్‌కు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తున్న నేపథ్యంలో... ఎన్నికలంటూ వస్తే గెలవలేమన్న భయంతోనే అధికార, ప్రతిపక్ష నేతలు ఒక అవగాహనకు వచ్చి ఉంటారని ఇరు పార్టీల నేతల ప్రైవేటు సంభాషణల్లో వినిపిస్తోంది. సాక్షి పత్రికలో పెట్టుబడులకు సంబంధించి రాజశేఖరరెడ్డి ఉన్నకాలంలోనే అసెంబ్లీలోనూ, బయటా విస్తృతమైన చర్చ జరిగినా నోరుమెదపని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆరోపణలు చేయడంలో ఆంతర్యం కూడా అదేనంటున్నారు. జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ హైకోర్టుకు లేఖలు రాయడంకూడా కుట్రలో ఒక భాగమేనని వారు ఆరోపిస్తున్నారు.


అధికార ప్రతిపక్షం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించిన కె.రోశయ్య ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించడంపట్ల అప్పట్లో టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. తాజా పరిస్థితుల్లో కూడా తిరిగి అదే బాటలో నడుస్తుండటం ఆ పార్టీ నేతల కు అంతుచిక్కడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ దీక్షల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఎత్తిచూపుతూ పలు రాజకీయ పార్టీలు టీడీపీకి బాధ్యతలను గుర్తుచేస్తున్నప్పటికీ ఆ పార్టీ నాయకత్వంలో కదలిక లేదు. ఈ విషయంలో టీడీపీ స్పందించకపోవడం వెనుక మతలబు ఉందని బీజేపీ గత కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తూనే ఉంది. మీ ప్రభుత్వాన్ని మేం కాపాడుతాం, మా ప్రయోజనాలను మీరు కాపాడాలంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తెరవెనుక ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఇటీవలి కాలంలో జగన్ నిర్వహించిన లక్ష్య దీక్ష, జల దీక్ష, జన దీక్షలకు వస్తున్న స్పందన చూసిన తర్వాత అధికార, ప్రతిపక్ష నేతల వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఒకే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ల తమ వైరాన్ని సైతం మరచి, ఉమ్మడి శత్రువు అయిన జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేసుకుని కలిసి పనిచేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.


కిరణ్‌తో బాబు దోస్తీ?

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్న కాలంలో అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ ఒంటికాలి మీద లేచే ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆ తర్వాత ఆచితూచి వ్యవహరించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడితే మీరు మద్దతునిస్తారా? అని రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కొందరు విలేకరులు చంద్రబాబును ప్రశ్నించినప్పుడు ఆయన నవ్వి ఊరుకున్నారే తప్ప సూటిగా సమాధానం చెప్పలేదు. తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన తమ పార్టీ ఎప్పటికీ కాంగ్రెస్‌కు మద్దతునిచ్చే ప్రసక్తేలేదని స్పష్టంగా చెప్పాల్సిన చంద్రబాబు చిరునవ్వులు చిందించడంలో ఆంతర్యమేమిటని అప్పట్లోనే ఆ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల మధ్య అంతర్గతంగా ఒక అవగాహన కుదిరిందా? అన్న అనుమానాలు ఆ పార్టీల్లోనే వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే జగన్‌కు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల విషయంలో తొందరపాటు చర్యలేవీ ఉండవని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ప్రకటించినా, ముఖ్యమంత్రి మాత్రం జగన్ వెంట వెళుతున్న ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికున్న ధైర్యం ఏమిటి? ప్రభుత్వం పడిపోకుండా టీడీపీ కాపాడుతుందనే కదా అని పీసీసీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. జగన్ వెంట ఎమ్మెల్యేలు వెళుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడదామని ఇటీవలి కాలంలో కోస్తా, రాయలసీమకు చెందిన ఇద్దరు నాయకులు సూచించినప్పటికీ, అధినేత తమనెందుకు వారించారో వారికి మొదట్లో అర్థం కాలేదు. అయితే ఆ తర్వాత చంద్రబాబు రాజకీయ మర్మాన్ని వివరించడంతో వారు కూడా సర్దుకుపోయారని పార్టీ వర్గాలు చెప్పాయి.



టీడీపీ నేతల నోట సీఎం పాట

సాధారణంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి భగ్గుమంటుంటుంది. కానీ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష టీడీపీ నేతలు ముఖ్యమంత్రి పాడిన పాటనే పాడుతున్నారు. సీఎం నాలుగు రోజుల కిందట ఢిల్లీ పర్యటన సందర్భంగా తొలిసారి అధికారిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జగన్ వెంట నడుస్తున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే హైదరాబాద్‌లో టీడీపీ అధికార ప్రతినిధి విలేకరుల సమావేశం పెట్టి అదే డిమాండ్‌ను మరింత గట్టిగా వినిపించారు. అలాగే సోమవారం ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే హత్య కేసుకు సంబంధించి తాను జగన్‌కు ఏదో సహాయం చేసినట్టు చెప్పారు. అదేరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ను ఆ కేసులోంచి తప్పించారంటూ ఆరోపించారు.

ఈ రకంగా అధికార, ప్రతిపక్ష నేతలు కూడబలుక్కుని మాట్లాడుతున్నట్టుగా ఉందని ఆ పార్టీల నేతలే అంటున్నారు. లేదంటే జగన్ వెంట వెళుతున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా తన ప్రభుత్వానికి ఏం ఢోకా లేదన్న భరోసా కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అలా ఎందుకు మాట్లాడారు? కాంగ్రెస్‌లోని తెలంగాణకు చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలంగాణ అంశాన్ని పక్కనపెట్టి మరీ జగన్‌పై ఎందుకు దుమ్మెత్తిపోస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్‌లో రాజశేఖరరెడ్డి లేరు కాబట్టి ఆ పార్టీకి మద్దతునివ్వాలని నిర్ణయించామని పీఆర్పీ నాయకుడు కోటగిరి విద్యాధరరావు చెప్పడంలోని అర్థమేమిటి? తెరవెనుక పరస్పర అవగాహన కుదిరింది కాబట్టే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ట్రస్ట్ భవన్‌లో ఉండే ఒక నాయకుడు చెప్పారు.


46 మంది ఉన్నప్పుడే పెట్టాం...

2008లో పార్టీకి కేవలం 46 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పుడు, గెలవలేమని తెలిసినా వైఎస్ మంత్రివర్గంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టాం... ఇప్పుడు పెట్టడానికి ఎందుకు సంశయం? ఆనాడు మంత్రివర్గం విశ్వాసం కోల్పోయిందంటూ అవిశ్వాస తీర్మాన నోటీసుపై చంద్రబాబు మొదటి సంతకం చేశారు... ఇప్పుడు ఇంతటి అవకాశంలోనూ ఆయన మౌనంగా ఉంటున్నారంటే సీఎంతో ఏదో ఒప్పందం కుదిరే ఉంటుందని టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యవహారాలన్నీ సోనియాగాంధీ సూచనల మేరకే జరుగుతున్నాయని పీసీసీ నాయకుడొకరు చెబుతున్నారు. జగన్‌ను టార్గెట్ చేసుకుని మిత్రపక్షాలు, శత్రుపక్షాలు అన్న తేడా లేకుండా నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పెద్ద నాయకుడొకరు మంగళవారం సీఎల్పీ వద్ద తన మనసులోని మాటను బయటపెట్టారు. 
Click Here!
  సుమోటోగా స్వీకరిస్తే చాలా లేఖలొస్తాయ్!
  హైకోర్టు కొత్త సంప్రదాయానికి తెరతీసింది: సబ్బం హరి
* ఇలాగైతే ఇక ప్రతి ఒక్కరి మీదా లేఖలు వెల్లువెత్తుతాయి* రేపు ఎవరైనా సీఎంపై లేఖరాస్తే కోర్టు సుమోటోగా స్వీకరిస్తుందా?* నెహ్రూ నుంచి మన్మోహన్ వరకూ అందరిపైనా ఆరోపణలు వచ్చాయి * వీరెవరిపైనా సుమోటోగా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు * కాంగ్రెస్ సొంత సంస్థ అనుకునే సీబీఐ చేత జగన్‌పై దర్యాప్తు చేయించొచ్చు కదా... అందుకు జగన్ కూడా సహకరిస్తారు..* వైఎస్సార్‌ను సీఎం కిరణ్ చులకన చేస్తూ మాట్లాడటం తగదు... ఆయనను స్పీకర్‌ను చేసింది వైఎస్సేనన్న సంగతి మరువరాదు* దీనిపై త్వరలో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టాన వర్గంతో మాట్లాడతా

శంకర్‌రావు లేఖను సుమోటోగా స్వీకరిస్తూ హైకోర్టు కొత్త సంప్రదాయానికి తెర తీసిందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించా రు. యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కంపెనీల్లో పెట్టుబడులుపెట్టిన సంస్థలకు హైకోర్టు నోటీసులివ్వటంపై ఆయన మంగళవారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ‘‘హైకోర్టుకు తాను లేఖ రాయలేదని మంత్రి శంకర్‌రావు చెప్పటంతో విషయం చర్చనీయాంశమైంది. మూడు నెలల కిందట మీడియాకు ఇచ్చిన లేఖపై హైకోర్టు స్పందించిందని ఆయన చెప్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా రాజకీయ నాయకుల వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన దాఖలాల్లేవు’’ అని హరి పేర్కొన్నారు. అసెంబ్లీలో కూడా ఇలాంటి ఆరోపణలు పరస్పరం చేసుకోవటం సర్వసాధారణమన్నారు.

‘‘ప్రతి రోజూ మీడియాలో ఎవరో ఒక ప్రజాప్రతినిధిపై ఆరోపణలు వస్తూనే ఉంటాయి. దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీలతో పాటు.. చివరికి దేశమంతా సత్యవంతుడని చెప్పే ప్రస్తుత ప్రధాని మన్మోహన్‌పై కూడా 2జీ స్పెక్ట్రం అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరెవరిపైనా కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేసిన దాఖలాల్లేవు. రేపు నేను కానీ, మరెవరైనా కానీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై లేఖ రాస్తే హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేస్తుందా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి లేఖలను సుమోటోగా తీసుకుంటే భవిష్యత్తులో ప్రతి ఒక్కరిపైనా ఔనా? కాదా? అంటూ కోర్టులకు లేఖలు రాసే ప్రమాదముందన్నారు. సీబీఐ వ్యవస్థ కాంగ్రెస్ సొంత సంస్థగా విపక్షాలన్నీ వ్యాఖ్యానిస్తున్నాయని, అలాంటి సీబీఐతోనే జగన్‌పై విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయొచ్చుకదా అని ప్రశ్నించారు. దీనిని జగన్ కూడా స్వాగతిస్తారని పేర్కొన్నారు.

స్పీకర్‌ను చేసింది వైఎస్సేనని మరవరాదు..
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి రాజకీయ వారసులమని చెప్పుకుంటూ, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ముఖ్యమంత్రి మాట్లాడటం తగదని సబ్బం అన్నారు. ఒకసారి వారసుల మంటారని, మరోసారి ఆయనపైనే ఆరోపణలతో అభాండాలు వేస్తు న్నారని విమర్శించారు. వైఎస్సార్ ఉత్తముడనో.. లేదా అవినీతిపరుడనో ఏదో ఒక వ్యాఖ్యకు కట్టుబడి ఉండాలన్నారు. స్పీకర్‌గా విధులు ప్రారంభించే కార్యక్రమానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరుకాకున్నా వైఎస్ స్వయంగా తోడ్కొనివెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారనే విషయం కిరణ్ మర్చిపోవటం శోచనీయమన్నారు. వైఎస్సార్‌కు మాజీ ప్రధాని పీవీతో అపాయింట్‌మెంట్ ఇప్పించానన్న కిరణ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దీనిపై వచ్చే నెల 7న ఢిల్లీ వెళ్లి ప్రణబ్, మొయిలీ తదితర కాంగ్రెస్ అధిష్టాన వర్గం నేతలతో మాట్లాడనున్నట్లు తెలిపారు.

ప్రస్తుత గందరగోళ పరిస్థితుల దృష్ట్యా గత 15-20 రోజుల నుంచి అధిష్టానం జగన్‌తో సంధి ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో విషయం తేటతెల్లమవుతుందని వెల్లడించారు. ఇలాంటి సమయంలో కిరణ్ వ్యాఖ్యలు అనుమానాలకు దారితీస్తున్నాయన్నారు. క్యాబినెట్లో ఒకరిద్దరు మంత్రులు కూడా వైఎస్సార్, జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక సీఎం హస్తముందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా వైఎస్సార్‌పై సీఎం వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానా? లేదా అధిష్టానం ఆదేశాల మేరకే చేస్తున్నారా అన్న సందేహం కూడా నెలకొందన్నారు.

కాంగ్రెస్ చాలా మందిని చాలా రాష్ట్రాల్లో సీఎంలను చేసిందని, వారెవరికీ వైఎస్సార్‌కు వచ్చినంత గుర్తింపు రాలేదన్న విషయాన్ని గుర్తించాలని హితవుపలికారు. తనను విప్‌గా, స్పీకర్‌గా చేసిన వైఎస్సార్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం కిరణ్‌కు తగదని, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు. చంద్రబాబులా వెన్నుపోటుదారుగా మిగలకూడదనే 2014 వరకు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదని జగన్ స్పష్టం చేశారన్నారు. అయినా కావాలనే దమ్ముంటే రాజీనామా చేయండంటూ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు.
Click Here!

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై అంబటి రాంబాబు నిప్పులు
* వైఎస్, జగన్‌లపై కిరణ్ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనం * ‘రచ్చబండ’ను వైఎస్ కుటుంబాన్ని కించపరిచేందుకు ఉపయోగిస్తున్నారు * సీఎం కుటుంబంపై ఆరోపణలు వచ్చినపుడు చీఫ్ విప్‌గానే కిరణ్ జవాబు * ఆ ఆరోపణలపై సమాధానం చెప్పటానికి ఆరు నిమిషాలు చాలు * సీఎం గొప్పలు చెప్పుకుంటూ వైఎస్‌ను కించపరిచే దుస్సాహసం చేస్తున్నారు * ఆయన మాటలను బట్టి వైఎస్ మరణంపై కొత్త అనుమానాలు వస్తున్నాయి * సీబీఐ కిరణ్‌ను విచారించిందా? లేకపోతే కేసును మళ్లీ విచారించాల్సిందే * పీవీతో వైఎస్‌కు అపాయింట్‌మెంట్ ఇప్పించాననటం కిరణ్ పిట్టలదొర కథ * ఆయన తీరు చూస్తే టీడీపీతో కుమ్మక్కయి ‘ఫీడ్’ ఇస్తున్నట్లు తెలుస్తోంది

‘కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్... ’ అన్న చందంగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహార శైలి ఉందని.. యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మద్దతుదారుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి రోజు రచ్చబండ పర్యటనలో సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలు పై పద్యాన్ని అక్షరాలా తలపిస్తున్నాయని అన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించకుండా దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డినీ ఆయన కుటుంబీకులను కించపరిచేందుకు ఉపయోగించటం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో జగన్ క్యాంపు కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యేలు గోనె ప్రకాశరావు, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.ఎ.రెహ్మాన్, కిసాన్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం కిరణ్ గొప్పలు చెప్పుకోవటంపై తీవ్రంగా మండి పడ్డారు. ఓ హత్య కేసులో జగన్ ముద్దాయి అయినట్లూ, ఆయనను తానే రక్షించినట్లూ కిరణ్ చెప్పుకోవటం ఆయన దిగజారుడుతనానికీ, చౌకబారు మాటలకూ నిదర్శనమని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు కనుకనే ఆయనపై కుట్రబుద్ధితో టీడీపీ ఈ ఆరోపణలు చేసింది. అవి అసెంబ్లీలో చర్చకు వచ్చినపుడు చీఫ్ విప్‌గా మీరు (కిరణ్) ఉన్నారు కనుక, సభా నాయకుడి(వైఎస్) పైనా, ఆయన కుటుంబీకులపైనా ఆరోపణలు వచ్చినపుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద, అప్పటి మంత్రుల మీదా ఉంది. చీఫ్ విప్‌గా అది మీ ధర్మం, అదే మీరూ చేశారు. అంత మాత్రాన మీరేమైనా కాపాడే ప్రభువులనుకుంటున్నారా?’’ అని అంబటి ధ్వజమెత్తారు.

‘‘మీపై (కిరణ్‌పై) వైఎస్‌కు ఎంతో నమ్మకం ఉండబట్టే ఆరోపణల విషయమై ఏమీ చెప్పలేదని అంటున్నారు. ఆ రోజు వైఎస్ నిన్నెందుకు అడగలేదూ అంటే ఆయనకు స్పష్టంగా తెలుసు ఇది తనపైనా తన కుటుంబీకులపైనా రాజకీయంగా చేసిన కుట్రపూరిత ఆరోపణ అని, అది గాలికి తేలిపోయే ఆరోపణా అని తెలుసు.. అందుకే వైఎస్ దీన్ని చాలా చిన్న విషయంగా తీసుకున్నారు. నువ్వు 60 రోజులు కష్టపడి అసెంబ్లీలో మాట్లాడానని చెప్పుకుంటున్నావు. అది అవాస్తవం, ఇది చాలా చిన్న ఆరోపణ, సమాధానం చెప్పటానికి ఆరు నిమిషాలు కూడా శ్రమించాల్సిన అవసరం లేదు’’ అని రాంబాబు తేల్చి చెప్పారు. ‘‘అయినా మీరేం చేశారు? దోషిని, నిర్దోషి అని రుజువు చేశారా? లేక నిర్దోషిని నిర్దోషి అని రుజువు చేశారా?’’ అని ప్రశ్నించారు. ‘‘మీరు చెప్పేదే కనుక నిజమైతే ఒక దోషిని నిర్దోషిగా రుజువు చేసినందుకు ముఖ్యమంత్రి పీఠంపై ఒక్క నిమిషం కూడా కొనసాగటానికి అనర్హుడివి, తక్షణం దిగి పోవాలి’’ అని సవాల్ విసిరారు.

టీడీపీ ఇలాంటి కుట్రపూరితమైన ఆరోపణ చేయగానే ఏ మాత్రం వెనుకాడకుండా సీబీఐ విచారణకు ఆదేశించారనీ, ఈ కేసులో జగన్‌కూ, మరో మంత్రికీ ఎలాంటి సంబంధమూ లేదనీ తేల్చిందనీ అంబటి గుర్తు చేశారు. వైఎస్ మృతి చెందిన రోజు హెలికాప్టర్‌లో తాను కూడా బయలుదేరాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో వైఎస్ ఏదో పని చెబితే అది సంప్రదాయ విరుద్ధమైనది కనుక తాను చేయనందు వల్ల వెళ్ల లేకపోయాననీ కిరణ్ చెప్పటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని రాంబాబు అన్నారు. ‘‘వైఎస్ మీకు ఏం చెప్పారో, వివరణ ఇవ్వటానికి ఆయన ప్రస్తుతం లేరు, ఇలాంటి మాటలు మాట్లాడి మీ (కిరణ్) గొప్పతనాన్ని చెప్పుకునే తాపత్రయపడుతూ వైఎస్‌ను కించపరిచే దుస్సాహసానికి ఒడిగడుతున్నారు’’ అని ఆయన విమర్శించారు.

‘‘ముఖ్యమంత్రి చెప్పిన మాటలను బట్టి ఆయనే తనపై అనుమానాలను రేకెత్తిస్తున్నారు.. వైఎస్ మృతిపై విచారణ జరిపిన సీబీఐ బృందం అసలు కిరణ్‌ను విచారించిందా? విచారించకపోతే అది అసంపూర్తిగా ముగిసినట్లే అని అభిప్రాయపడుతున్నా’’ అని అంబటి పేర్కొన్నారు. కిరణ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ మృతి కేసుపై పునర్విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్‌తో 30 ఏళ్లు కలిసి పనిచేసినట్లుగా సీఎం చెప్పుకోవటం అంతా అబద్ధం అని అంబటి ఆక్షేపించారు. ‘‘1999 వరకూ కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్ వ్యతిరేక శిబిరంలో ఉన్న మాట వాస్తవం కాదా?’’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

పిట్టలదొర కథలు...
అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుతో వైఎస్‌కు తానే అపాయింట్‌మెంట్ ఇప్పించినట్లుగా కిరణ్ పిట్టల దొర కథలు చెబుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. ‘‘మన రాష్ట్రానికి చెందిన పీవీకి వైఎస్ ఎవరో తెలియని పరిస్థితి ఉంటుందంటే నమ్మాలా? అప్పటికే ఆయన పెద్ద ఎత్తున శాసనసభ్యుల్లోనూ, ఎంపీల్లోనూ బలం కలిగిన నాయకుడనే విషయం ఎవరికి తెలియదు?’’ అని రాంబాబు ప్రశ్నించారు. తాను వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన నాయకుడిననీ, ఆయనతో పాటు 1,400 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినవాడిననీ, తనలాంటి వారు కిరణ్ చెప్పే మాటలు నమ్మరనీ, ఇలాంటివి ఆయన ఇంకెవరైనా అమాయకుల ముందు చెప్పుకుని సంతృప్తి చెందాలనీ ఎద్దేవా చేశారు. వైఎస్ కోసం టీడీపీతో వైరం తెచ్చుకున్నట్లుగా కిరణ్ చెప్పుకోవటం సిగ్గు చేటన్నారు. ‘‘అంటే నువ్వు కాంగ్రెస్‌లో ఉంటూ టీడీపీతో అంతకు ముందు మిత్రత్వంతో ఉండే వాడివా? వైఎస్ వారసుడిగా చెప్పుకోవటానికి ఓవైపు తాపత్రయపడుతూ మరో వైపు ఇలా మాట్లాడతావా?’’ అని అంబటి ప్రశ్నించారు.

ఇంత కంటే నీతిమాలిన వ్యాఖ్యలు, కుట్రపూరిత, చౌకబారు మాటలు ఇక ఉండవన్నారు. ‘‘నీకు ముఖ్యమంత్రి స్థాయి లేదని మాకు తెలుసు, ఆ పదవికి పనికిరావని ప్రజలూ తెలుసుకున్నారు. కానీ నీ మాటలనుబట్టి ఇపుడు నీకూ తెలిసి వచ్చిందనుకుంటున్నాను’’ అని కిరణ్‌ను ఉద్దేశించి అంబటి వ్యాఖ్యానించారు. వైఎస్‌నూ, ఆయన కుటుంబీకులనూ కించపరిచేందుకు కిరణ్ చేస్తున్న యత్నం చూస్తే ఆయన టీడీపీతో కుమ్మక్కు అయినట్లుగా తెలిసిపోతోందన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ నాయకులకు కావాల్సిన ఫీడ్ (సమాచారాన్ని)ను ముఖ్యమంత్రే అందజేస్తున్నట్లు ఉందని ఆయన ఆరోపించారు. కిరణ్ చేసిన వ్యాఖ్యలను పట్టుకుని ఇక టీడీపీ వారు కూడా పసలేని ఆరోపణలే చేస్తారని ఆయన అన్నారు.

అవి నోటీసులే.. తీర్పు కాదు!

‘సాక్షిలో పెట్టుబడులపై హైకోర్టు నోటీసులు ఇవ్వటం, కిరణ్ ఇలా మాట్లాడటం వెనుక రాజకీయ కుట్ర ఏమైనా ఉందని భావిస్తున్నారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించినపుడు ‘‘ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా పరిగణించి కోర్టు జారీ చేసిన నోటీసులపై మేమేమీ వ్యాఖ్యానించం. నోటీసులకు జగన్ తరఫున సమాధానాలు ఇస్తారు. న్యాయ పోరాటం చేస్తారు. అయినా కోర్టు జారీ చేసింది నోటీసులే కదా! మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు కూడా ఏసీబీ కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి కదా! కోర్టు ఇచ్చిందేమీ తీర్పు కాదు కదా’’ అని అంబటి సమాధానమిచ్చారు. అత్యంత ప్రజాదరణగలిగిన నాయకుడైన జగన్‌ను అన్ని వైపుల నుంచీ ముట్టడించటానికి పద్మవ్యూహం పన్నుతున్నారనీ, కాంగ్రెస్ అధిష్టానవర్గం కూడా అందుకు ప్రయత్నిస్తూ ఉండవచ్చనీ అంబటి జవాబిచ్చారు. ‘‘కానీ జగన్‌ను ఎవరూ ఏమీ చెయ్యలేరు... చెయ్యలేరు... చెయ్యలేరు...’’ అని ఆయన స్పష్టంచేశారు.

నాటి మృతులకు ఆర్థిక సాయం ఏమైంది ?
వై.ఎస్.రాజశేఖరరెడ్డి మృతిని జీర్ణించుకోలేక తనువు చాలించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తానని ఏఐసీసీ ప్రకటించి నాలుగు నెలలు దాటుతున్నా ఆ ఊసే ఎందుకు ఎత్తటం లేదని అంబటి ప్రశ్నించారు. వైఎస్‌పై ప్రజలకు ఎంత అభిమానం ఉందో సోనియా, మన్మోహన్‌సింగ్‌కు కూడా అంతే అభిమానం ఉందని కిరణ్ చెప్పటం నిజమే అయితే.. ఆ మృతుల కుటుంబాలను ఎందుకు ఇంత వరకూ ఆదుకోవటం లేదని ఆయన నిలదీశారు.

No comments:

Post a Comment