Tuesday, February 22, 2011

జగన్ దీక్షకు మద్దతుగా ఉవ్వెత్తున.. ఉద్యమంలా ... రాజధాని బాట పట్టిన విద్యార్థి లోకం

నాలుగోరోజు వేలాదిగా వచ్చిన స్టూడెంట్లు
నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువ మంది
ఓయూ ఉద్రిక్తత, ట్రాఫిక్ ఇబ్బందులున్నా దీక్షా ప్రాంగణానికి పోటెత్తిన విద్యార్థి
జగనే కాబోయే సీఎం అంటూ నినాదాలు

ప్రభుత్వంపై విద్యార్థుల సమరభేరి..
ఓవైపు ఉస్మానియా వర్సిటీలో ఉద్రిక్తత.. మరోవైపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన నగరం.. పరిస్థితి తెలిసి జనం బయటకు రాలేదు.. అప్పటికే రోడ్డుపైకి వచ్చిన వాహనం ముందుకు కదల్లేదు.. అయినా విద్యార్థులు ఆగలేదు.. తమ కోసం నాలుగు రోజులుగా తిండి తినకుండా పోరాడుతున్న యువనేత జగన్ కోసం ఉవ్వెత్తున తరలివచ్చారు. సోమవారం కాలేజీలకు సెలవు లేదు.. అలా అని బంద్ కూడా కాదు.. అయినా చదువులను పక్కన పెట్టి మరీ వారు వేలాదిగా జగన్ బాట పట్టారు. యువనేతకు బ్రహ్మరథం పట్టారు. జగనన్నకు బాసటగా మేమున్నామంటూ సంఘీభావం తెలిపారు. ఫలితం సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణం’ మరోసారి జనసంద్రాన్ని తలపించింది.

హోరుమంటూ వర్షం..


ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యువనేత వైఎస్ జగన్ చేపట్టిన ‘ఫీజు పోరు’ సోమవారం నాలుగో రోజు కూడా భారీ జన హోరుతో సాగింది. విద్యార్థులు, జగన్ అభిమానులు వివిధ జిల్లాల నుంచి ఉత్సాహంతో వచ్చి దీక్షకు సంపూర్ణమద్దతు పలికారు. యువనేత సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్రలేచి అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యార్థులు, అభిమాన నాయకులకు చిరునవ్వుతో అభివాదం చేశారు. ఆ తరువాత దినపత్రికలు చదివి వేదిక మీదకు వచ్చారు. ఆ సమయంలో జగన్ తల్లి విజయమ్మ, సతీమణి భారతి ఆయన్ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తెల్లవారుజామున ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో వేదికతో పాటు దీక్షా శిబిరం తడిసి ముద్దయింది. ఆదివారం రాత్రి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది మహిళలు, అభిమానులు, నేతలు, విద్యార్థులు దీక్షా శిబిరంలోనే యువనేతతోపాటే నిద్రించారు. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వారు తడిచినా శిబిరాన్ని మాత్రం వదిలివెళ్లలేదు.

నలుమూలల నుంచీ..


ఉదయాన్నే నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున శిబిరానికి తరలివచ్చారు. జేఎన్టీయూ, ఆంధ్ర, నాగార్జున, ఉస్మానియా, కాకతీయ వర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు కెరటాల్లా కదలివచ్చారు. నాలుగోరోజు దీక్షలో మేము సైతం అంటూ జగన్‌తో కలిసి పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నేతలు, పలువురు విద్యార్థులు ప్రసంగిస్తూ భావోద్వేగాలకు లోనయ్యారు. కూటికి లే ని పేద కుటుంబాల్లో పుట్టి ఇంజనీరింగ్ చదువుతున్నామంటే వైఎస్సార్ పెట్టిన భిక్షేనని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం వెంట నే స్పందించకపోతే కూల్చేస్తామంటూ హెచ్చరించారు. 24నుంచి కళాశాలలు మూసివేస్తామని యాజ మాన్యాలు ప్రకటించిన నేపథ్యంలో.. విద్యార్థులంతా ఏకమై అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు.

 

జగన్ కు తగ్గిన షుగర్ లెవల్
 
యువనేత వైఎస్ జగన్మోహన రెడ్డికి సోమవారం సాయంత్రం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తు న్న నేపథ్యంలో ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పారు. షుగర్ లెవల్ తగ్గిపోతోంద న్నారు. బీపీ 120/70, పల్స్‌రేటు 64, బ్లడ్ షుగర్ 72 ఎంజీ ఉందని, మూత్రం లో కీటోన్స్ ఉన్నాయని నిర్ధారించారు.

 
ఉదయం నుంచే.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థి సంఘాలు చలో అసెంబ్లీ చేపట్టిన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలున్నా విద్యార్థులు ఆగలేదు. ఉదయం పదిగంటలనుంచి రాత్రి వరకు నగరంతో పాటు శివార్లలోని కళాశాలలు, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు జగన్‌కు మద్దతు తెలిపేందుకు భారీగా వచ్చారు. పెద్ద ఎత్తున ర్యాలీగా బాజా భజంత్రీలతో టపాసులు పేల్చుకుంటూ వచ్చి తమ పక్షాన పోరాడుతున్న యువనేతకు తామున్నామని భరోసా ఇచ్చారు. జగన్ కాబోయే సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. విద్యార్థులతో సమానంగా విద్యార్థినులు రావడం గమనార్హం. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మెదక్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి యువనేతకు సంఘీభావం తెలిపారు.

మేమంతా నీతోనే..


సోమవారం కూడా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్షా శిబిరానికి తరలివచ్చారు. వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళి, పుల్లా భాస్కర్ దంపతులతో పాటు ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, గుర్నాథ రెడ్డి, శోభానాగిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జయసుధ, శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, సత్యవతి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, కమలమ్మ, కె.భారతి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌లతోపాటు భూమన కరుణాకర్‌రెడ్డి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, సినీనటి రోజా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ సుబ్రహ్మణ్యంరెడ్డి, నెల్లూరు డీసీసీ మాజీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, అంబటి రాంబాబు, బాజిరెడ్డి గోవర్ధన్, రెహ్మాన్, రాచమల్ల సిద్దేశ్వర్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

కన్నీరుమున్నీరై..


నాలుగు రోజులుగా తిండి తినకున్నా.. వేదికపై కూర్చునే ఉంటూ.. తనను కలవడానికి వచ్చిన వారితో కరచాలనం చేస్తూ ఉన్న జగన్.. ఆదివారం మధ్యాహ్నం శ్రేయోభిలాషుల ఒత్తిడితో నడుం వాల్చారు. తనకు వీలున్నంత వరకు వచ్చిన ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడుతూ కరచాలనం చేశారు. ఆయన ఓపికను, పట్టుదలను హర్షిస్తూనే.. తిండి తినకుండా దీక్ష చేస్తున్న జగన్‌ను చూసి పలువురు మహిళా నాయకురాళ్లు, విద్యార్థినీ విద్యార్థులు కంటతడి పెట్టారు. నా కొడుకు ఒక్కరోజు తినకుంటేనే నేను ఎంతో బాధకు లోనవుతాను..అటువంటిది నాలుగురోజులు మెతుకు ముట్టకుండా మొక్కవోని దీక్ష చేపట్టిన యువనేత గురించి ఆ తల్లి గుండె ఎంత క్షోభిస్తుందో అని ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి కన్నీళ్ల పర్యంత మయ్యారు. సిద్దిపేట నుంచి వచ్చిన ఓ వృద్ధురాలు మాట్లాడుతూ ‘నాల్రోజుల నుంచి కూడు లేకపాయె. అయినా మంచిగ పల్కరిస్తున్నడు. నన్ను దగ్గరకు తీసుకుండు. పిల్లల ఇస్కూల్ ఫీజుల కోసం ఆయన పోరాటం చేస్తుండు. అందుకే వచ్చినం’ అని చెప్పింది.


ప్రభుత్వం దిగిరాక తప్పదు..


తనకు అన్ని సౌఖ్యాలు ఉన్నా.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చే యించడం కోసం.. బడుగుల సంక్షేమం కోసం జగన్ కఠినమైన నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన చిత్తశుద్ధి ముందు సర్కారు దిగిరాకతప్పదు. విద్యార్థుల కష్టాలను అర్థం చేసుకుని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలి. వైఎస్సార్ ఆశయాలను పట్టించుకోని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.

- తోపుదుర్తి కవిత, అనంతపురం జెడ్పీ చైర్ పర్సన్ 


జగన్ వెంటనే దీక్ష విరమించాలి: పితాని
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే దీక్షను విరమించాలని ఆయన కోరారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఫీజులు చెల్లిస్తామని పితాని తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలలు మూసివేయడానికి యాజమాన్యానికి అధికారం లేదని ఆయన అన్నారు. 
24లోగా స్పందించకుంటే.. అసెంబ్లీ ముట్టడి
వివిధ వర్సిటీల విద్యార్థుల నిర్ణయం
కొండా సురేఖ ప్రకటన
ముట్టడికి తెలంగాణ యూత్ ఫోర్స్ మద్దతు


హైదరాబాద్, న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండు చేస్తూ యువనేత జగన్ చేస్తున్న నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరినా... వీటి చెల్లింపుపై ప్రభుత్వం ప్రకటన చేయనందుకు నిరసనగా అసెంబ్లీని ముట్టడించాలని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు నిర్ణయించారు. జగన్‌తోపాటు సోమవారం నిరాహార దీక్ష చేసిన జేఎన్‌టీయూ, కృష్ణదేవరాయ, ఉస్మానియా, కాకతీయ, వెంకటేశ్వర వర్సిటీల విద్యార్థులు ఈమేరకు నిర్ణయించినట్లు మాజీ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ‘ఫీజులు, ఉపకారవేతనాలు చెల్లిస్తామని ఈనెల 24లోగా ప్రభుత్వం ప్రకటించకపోతే... అసెంబ్లీని ముట్టడించాలని విద్యార్థులు నిర్ణయించారు. జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదు. విద్యార్థులు తలుచుకుంటే.. ప్రభుత్వాలు దిగిరాక తప్పదు. సర్కారు వెంటనే స్పందించి విద్యార్థులకు ఫీజులు, ఉపకారవేతనాలు చెల్లించాలి’ అని ఆమె డిమాండు చేశారు. అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు అజయ్ మద్దతు ప్రకటించారు. విద్యార్థులతో పాటు ఆయన కూడా సోమవారం నిరాహార దీక్ష చేశారు. ఫీజుల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కాలేజీ యాజమాన్యాలు కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పోరాటానికి సహకరించకపోతే.. 24 నుంచి కాలేజీలను తామే మూసేస్తామని హెచ్చరించారు. జగన్‌కు ఉన్న సహనం విద్యార్థులుగా తమకు లేదని, జగన్‌కు ఏదైనా జరిగితే విద్యార్థిలోకం భగ్గుమంటుందన్నారు. 


దీక్షలో నేతల ప్రసంగాలివీ...
అనుమాన ముంటే నిఘా పెట్టుకోండి..
నాలుగురోజులుగా జగన్ నిరాహారదీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. జగన్‌కు ఏది జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ఆయన దీక్ష బూటకమని కొందరు ప్రేలాపనలు చేస్తున్నారు. వారికి ఎలాంటి అనుమానాలున్నా నిఘా ఏర్పాటుచేసుకోవచ్చు. రహస్య కెమెరాలు ఏర్పాటు చేసుకోవచ్చు. జగన్ దీక్షా శిబిరానికి జనం రావడం లేదని చెప్పేవారికి ధైర్యముంటే రోజుకు ఇక్కడకు ఎన్నివేల మంది వస్తున్నారో లెక్కలేసుకోవాలి.
- కొండాసురేఖ, మాజీమంత్రి

నిధులు మంజూరు చేయాలి..

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ఫీజులు చెల్లించడానికి వెంటనే నిధులు మంజూరు చేయాలి. కఠిన నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను చూస్తుంటే.. దుఃఖం ఆగడం లేదు.
-కమలమ్మ, బద్వేల్ ఎమ్మెల్యే

ఈ దీక్ష యువతకు ఆదర్శం..

జగన్ దీక్ష యువతకు ఆదర్శం. ఉడుకు రక్తం కాగుతున్నా.. జగన్ గాంధేయమార్గం ఎంచుకున్నారు. మద్యం విక్రయంతో 13 వేల కోట్ల రాబడి వస్తోంది. విద్యార్థుల కోసం 3 వేల కోట్లు ఖర్చు చేయలేరా? 

- బాజిరెడ్డి గోవర్థన్, మాజీ ఎమ్మెల్యే

విద్యార్థి శక్తి కత్తి కంటే పదునైనది..


విద్యార్థి శక్తి కత్తి కంటే పదునైనది. ప్రభుత్వం స్పందించకుంటే... అది కిరణ్ సర్కారు గుండెల్లో దిగడం ఖాయం. ఫీజుల రీయింబర్స్‌మెంట్ భారమని ప్రభుత్వం అంటోంది. ప్రజలపై పన్నులు వేస్తున్నారు. అది చెల్లించడం వారికి భారం కాదా?   - రోజా, సినీ నటి


సీఎం జీతాలు తీసుకోవడం లేదా?


సుప్రీంకోర్టు ఆదేశాలనూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫీజులు చెల్లించకుండా కాలేజీల యాజమాన్యాల మీద ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తప్పించుకోవాలని చూస్తోంది. సీఎం, మంత్రులు జీతాలు తీసుకోవడం లేదా? మరి విద్యార్థులకు మెస్ ఛార్జీలు, ఫీజులు ఎందుకు చెల్లించరు?

- ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా

సింహం నిరాహార దీక్షలో ఉంది..


ప్రజల కోసం తన జీవితాన్నే త్యాగం చేసుకునేందుకు సిద్ధమయిన జగన్‌ను చూస్తుంటే గుండెతరుక్కుపోతోంది. సింహం నిరాహారదీక్షలో ఉంది. దీక్ష తర్వాత జూలు విదిల్చిందంటే ఢిల్లీ ప్రభుత్వం కూడా మిగలదు.

-లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు

జగన్ కోసం సంఘటితంగా పనిచేయండి..


ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న యువనేత జగన్ కోసం ప్రజలందరూ సంఘటితంగా పనిచేయాలి. వైఎస్ ఆశయాలను పూర్తిగా నెరవేరిస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకు ప్రజలంతా ఆయనకు అండగా ఉండాలి. -సుబ్రహ్మణ్యం రెడ్డి, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్


కొండ నాలుకకు మందేస్తే..


ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన అత్యుత్తమ భారతీయుల సర్వేలో జగన్‌కు 20వ స్థానం లభించింది. రాజకీయాల్లో అట్టర్‌ప్లాప్ అయిన చిరంజీవిని కాంగ్రెస్‌లో చేర్చుకొన్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని.. చిరంజీవిని చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్‌కు ఉన్న కొద్దిపాటి బలం కూడా పోగొట్టుకుంది. - ఎల్లసిరి గోపాలరెడ్డి, నెల్లూరు డీసీసీ మాజీ అధ్యక్షుడు


ప్రభుత్వ ప్రతిష్ట దిగజారింది..


జగన్ చేస్తున్న నిరాహారదీక్ష పట్ల వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారిపోతోంది. పట్టుదలకు పోవద్దు. కాలక్షేపం చేయవద్దు. జగన్‌తో చర్చలు జరపాలి. విద్యార్థుల ఆందోళన గురించి వ్యంగ్యంగా మాట్లాడడం గొప్ప కాదు. వారి జీవితాలతో ఆటలాడుకోవద్దు.

-ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రాష్ట్ర సాంస్కృతిక మండలి మాజీ చైర్మన్

జగన్‌కు ఎవరూ సాటిరారు


కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో కుమ్మక్కయింది. వెయ్యి మంది చంద్రబాబులు కూడా జగన్‌కు సాటిరారు.

- మాజీ ఎమ్మెల్సీ రెహమాన్

తల్లికి ఉండాల్సిన లక్షణాల్లో ఒక్కటి కూడా సోనియాగాంధీకి లేవు. జగన్‌ను చూస్తుంటే... కడుపు తరుక్కుపోతోంది. జగన్‌కు ఆపద వస్తే రాష్ట్రం తగలబడుతుంది. 

- సోమిరెడ్డి, నల్గొండ జిల్లా టీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు 

జగన్... ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మీ కఠోర దీక్షకు సర్కారు దిగిరాక తప్పదు. ప్రభుత్వం దిగొచ్చి విద్యార్థులను ఆదుకోవాలి.
- వైఎస్సార్ క్లాస్‌మేట్ మోహన్‌రెడ్డి
 

జగన్‌తో సీఎం చర్చలు జరపాలి
 
ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్ నిధుల కోసం దీక్ష చేస్తున్న యువనేత జగన్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, కొండా మురళి, పుల్లా పద్మావతి డిమాండ్ చేశారు. మండలి మీడియాపాయింట్ వద్ద సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. రీయింబర్స్‌మెంటు అమలులో ప్రభుత్వం విఫలమైం దని, అస్పష్ట విధానాలతో 25ల క్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. వారికి న్యాయం చేయాలని జగన్ దీక్ష చేపట్టి నాలుగు రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆయన వద్దకు సీఎం వెంటనే వెళ్లి చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆ సమస్యలపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు కాలయాపనకే తప్ప సమస్య పరిష్కారానికి కాదని విమర్శించారు. ఆ సబ్‌కమిటీ చర్చలకు వెళితే లాభమేమీ ఉండదని వ్యాఖ్యానించారు.

వైఎస్ ఆశయాలకు సర్కారు తూట్లు: జూపూడి


రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి సమావేశం ప్రారంభమవగానే రీయింబర్స్‌మెంట్‌పై వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలనే ఉద్దేశంతో వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకానికి ప్రభుత్వం నిధులివ్వకుండా నీరుగారుస్తోందని దుయ్యబట్టారు. నిజంగా వైఎస్ వారసులమని మీరనుకుంటే.. జగన్‌తో చర్చించాలని, ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని జూపూడి డిమాండ్ చేశారు. అయితే రీయింబర్స్‌మెంట్‌పై మధ్యాహ్నం లఘు చర్చలో చర్చిద్దామని చైర్మన్ చక్రపాణి పేర్కొంటూ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.

దీక్ష ముగిసేలోగా బకాయిలు చెల్లించండి

ప్రభుత్వానికి వైఎస్సార్ లీగల్ సెల్ డిమాండ్
ఈతరం నేత జగన్: అంబటి
చాణక్యుడు, చంద్రగుప్తుడితో జగన్ సమానం: గట్టు
నవసమాజం జగన్‌తోనే సాధ్యం: కేకే మహేందర్‌రెడ్డి

  యువనేత జగన్ చేపట్టిన ‘ఫీజు పోరు’ దీక్ష ముగిసేలోగా ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని వైఎస్సార్ లీగల్‌సెల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారమిక్కడ హైకోర్టు న్యాయవాది ఎస్.రాజేశ్వరరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జగన్ వర్గం నేతలు అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, కేకే.మహేందర్ రెడ్డి, వద్దిరెడ్డి చలమారెడ్డి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. యువనేత పార్టీ రాక ముందే న్యాయవాదులు భారీస్థాయిలో మద్దతు తెలపడం శుభపరిణామమన్నారు. న్యాయవాదులందరూ ఒక సంఘటిత శక్తిగా ఏర్పడి యువనేతకు మద్దతుగా నిలవాలని కోరారు. వైఎస్సార్ ఆ తరం నాయకుడయితే, జగన్ ఈతరం నాయకుడన్నారు. ‘జగన్‌కు పదవీకాంక్ష ఉందని చంద్రబాబు విమర్శించడం విడ్డూరంగా ఉంది.

పదవి రాకపోవడం వల్లే జగన్ అధిష్టానంతో ఢీకొడుతున్నారని పేర్కొనడం పూర్తి అవాస్తవం. అదే గనక నిజమైతే 150కి పైగా ఎమ్మెల్యేలు మద్దతు తెలిపిన ప్పుడే వైశ్రాయ్ సంఘటన పునరావృతమయ్యేది. సీఎంగా జగన్ ఏడాదికాలం పూర్తిచేసేవారు. రాష్ట్రంలో మోసపూరిత దొంగ దీక్షలు చేసిన చంద్రబాబు ఒక వైపు.. నీతి నిజాయితీకి మారుపేరుగా ఇచ్చిన మాటకు కట్టుబడే నేత వైఎస్ జగన్ మరో వైపు ఉన్నారు’ అని అంబటి తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా ఒంటిచేతితో 150కి పైగా సీట్లు సాధించగలరని, ఏడాది తర్వాత అయితే 170, రెండేళ్లు ఆగితే 200 సీట్లు గెలవగలరని ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రస్తుత ప్రభుత్వంలోని కొందరు మంత్రులు వైఎస్ పథకాలు గుదిబండలా మారాయంటున్నారు. సీఎం కిరణ్, మంత్రి బొత్స మాత్రం వైఎస్ పథకాలను కొనసాగిస్తామంటూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు’ అని విమర్శిం చారు. జగన్ చాణిక్యుడు, చంద్రగుప్తుడితో సమాన మని గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. సమసమాజం, నవసమాజం కోసం వైఎస్ కలలు కనేవారని.. ప్రస్తుతం వాటిని నెరవేర్చడం ఒక్క జగన్ వల్లే సాధ్యమవుతుందని కేకే.మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని రకాల సెల్స్ ఏకమై వైఎస్సార్ అనే కులంగా ఏర్పడాలని మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ పిలుపునిచ్చారు.


No comments:

Post a Comment