Saturday, February 19, 2011

సంక్షేమం పట్టని సర్కార్‌కు పాలించే హక్కులేదు



వైఎస్ ఆశయాలను పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత మాకు లేదు
పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడలేని ప్రభుత్వంలో సామాజిక న్యాయం
ఎలా ఉంటుంది...ఫీజుల పథకాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు...
సర్కారు ఫీజు చెల్లించనందువల్లేవరలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది
వైఎస్ ఉంటే తమ కూతురు బతికుండేదంటున్నారు వరలక్ష్మి తల్లిదండ్రులు
లక్షల మంది విద్యార్థులతో కలిసి చేస్తున్న డిమాండ్ ఒక్కటే... తక్షణం నిధులు
విడుదల చేయాలి... సమస్యకు బడ్జెట్‌లో శాశ్వత పరిష్కారం చూపాలి

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు, పథకాలకు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత తమకు లేదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడానికీ పనికిరాదని నిప్పులు చెరిగారు. ఒకవేళ కలిపితే ఆ బంగాళాఖాతమే కలుషితమవుతుందని దుయ్యబట్టారు. పేదల ముఖంలో చిరునవ్వును చూడలేని ఈ సర్కారుకు పాలించే అర్హత లేదన్నారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకం స్ఫూర్తిని ప్రభుత్వం దెబ్బతీస్తోందని దుయ్యబట్టారు. సర్కారు వైఖరికి నిరసనగా, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ‘ఫీజు పోరు’ పేరుతో వారం రోజుల నిరాహార దీక్షను జగన్ శుక్రవారం ప్రారంభించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి మొత్తం నిధులు రూ. 3,400 కోట్లు చెల్లించేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకైనా కొత్త బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ పథకానికి సరిపడినన్ని నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నా చౌక్‌లో మొదలుపెట్టిన ఈ దీక్షకు మద్దతు పలుకుతూ పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే...

ఏదీ సామాజిక న్యాయం?

సామాజిక న్యాయం అని ఒకరు మాట్లాడతారు. సామాజిక న్యాయం ఈ పార్టీలోనే ఉంది అని చెప్పి ఒకరు ఆ పార్టీలో చేరతారు. సామాజిక న్యాయం ఇక్కడే ఉంది అంటూ ఆ పార్టీ వారిని తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్క మాట చెప్పండి.. పేదవాడి మొహాన చిరునవ్వును చూడలేని ఈ సర్కారుకు సామాజిక న్యాయం ఉందా? రాష్ట్ర రాజధానిలో ఈ రోజు లక్షల గుండెలు ఒక్కటై.. ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని నినదిస్తున్నాయి.

‘పేదలకు పెద్ద చదువులు’ మహానేత ఆశయం

పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని నిత్యం తపించిన ఒక మహా నాయకుడి కథ చెబుతా... ప్రతి పేద విద్యార్థీ చదవాలని కాంక్షించిన జననేత గురించి చెబుతాను. పేదలు పెద్ద చదువులు చదవడానికి ఫీజు అడ్డంకి కాకూడదని వైఎస్ భావించారు. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి శ్రీకారం చుట్టారు. నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడని, నా కూతురు డాక్టర్ చదువుతోందంటూ పేదలు అనుకొంటున్నప్పుడు.. చదువుల కోసం ఉన్న ఆస్తిని తెగనమ్ముకోవాల్సిన అవసరం లేదని గర్వంగా చెబుతున్నప్పుడు.. ఫీజు కట్టడం సమస్య కాదని, పెద్ద చదువులు తమ హక్కని ప్రతి పేద విద్యార్థీ భావిస్తున్నప్పుడు... వారి మొహాల్లో కనిపించే చిరునవ్వుల మధ్య దివంగత నేత రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తూనే ఉంటారు. ఇవాళ ఆ మహానేతే బతికి ఉంటే తమ జీవితాలు ఇలా ఉండేవి కాదని ప్రతి పేదవాడు ఆకాశం వైపు చూస్తున్నాడు.

ఆ మాటలు విని చలించిపోయాను

కాలేజీలో ఫీజు కట్టలేక, చదివే దారిలేక ఆత్మహత్య చేసుకొన్న వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు.. ఆమె తల్లిదండ్రులు చెప్పిన విషయాలు విని చలించిపోయాను. వాచ్‌మన్ ఉద్యోగం చేసే తండ్రి, పంచాయతీ ఆఫీసులో స్వీపర్‌గా పనిచేస్తున్న తల్లి... నిరుపేద కుటుంబం.. ఇదీ వరలక్ష్మి నేపథ్యం. విద్యాసంత్సరం ముగుస్తున్నా ప్రభుత్వం ఒక్కపైసా కూడా చెల్లించకపోవడంతో కాలేజీలో విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారని, కాలేజీ యాజమాన్యం అడిగిన రూ. 30,000 చెల్లించడానికి అప్పోసప్పో చేయాలని వరలక్ష్మి అడిగితే.. ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ పరిస్థితి ఆ తల్లిదండ్రులది. ఇద్దరికీ కలిపి నెలకు రూ.2,800 సంపాదన మాత్రమే ఉన్న తమకు రూ. 30,000 అప్పు ఎవరిస్తారు? ఎలా తెచ్చివ్వగలం? అనుకొంటూ.. ఆ తల్లిదండ్రులు బాధపడుతుంటే ఆ కూతురు తట్టుకోలేకపోయింది. తమ బాధ చూడలేక కిరోసిన్ పోసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని, వైఎస్ ఉంటే తమ కూతురు చనిపోయి ఉండేది కాదని తల్లిదండ్రులు చెబుతుంటే నా మనసు కకావికలమైంది. ముక్కుపచ్చలారని... 18 సంవత్సరాలైనా నిండని వరలక్ష్మి ఆత్మహత్య చేసుకొంటే.. సిగ్గు లేని ప్రభుత్వం ఆమె ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయిందంటూ తప్పించుకోవాలని చూసింది. వరలక్ష్మి తల్లిదండ్రుల ఆవేదన చూశాక నాకనిపించింది.. ఒక్కరోజులో ఈ ధర్నా ముగియకూడదని! ఒక్కరోజు ధర్నాతో ముగిస్తే ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా ఉండదనిపించింది. నిరాహార దీక్షలు కొనసాగితే.. ఆకలి కేకల్లో ప్రతిపేదవాడి ఘోష వినపడితేనైనా సర్కారులో మానవత్వం మేలుకుని బడ్జెట్‌లో పథకానికి పూర్తి కేటాయింపులు చేస్తుందేమోనన్న చిన్న ఆశతో వారం రోజులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను.

పథకాన్ని నాశనం చేయాలని సర్కారు కుట్ర


25 లక్షల మంది పేద విద్యార్థుల చదువుకు రూ.3,400 కోట్లు అవసరముంటే.. ముష్టి వేసినట్లు రూ.1,000 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో వారం పది రోజుల్లో బడ్టెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆ బకాయిలు రూ. 2,400 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారు? మళ్లీ బడ్జెట్‌లో కొత్త సంవత్సరానికి రూ. 3,400 కోట్లు కేటాయించాల్సి ఉంటే.. ఆ మొత్తం రూ. 5,800 కోట్లు ఎలా తెస్తారు? ప్రభుత్వ ధోరణి చూస్తుంటే.. ఫీజుల పథకాన్ని నాశనం చేయాలని కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రతి పేదవాడిని బతికితే బతకండి... లేదంటే చావండి అన్న తీరుగా వ్యవహరిస్తోంది. మనసు లేని ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా?

బంగాళాఖాతమూ కలుషితమవుతుంది

పేదవాడి గోడు పట్టని ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేసినా పాపం లేదు. పుణ్యనదులు కలిసే బంగాళాఖాతంలో ఈ ప్రభుత్వాన్ని వేస్తే.. అదీ కలుషితమైపోతుంది. సామాజిక న్యాయం మీద అబద్ధాలు చెబితే.. ఈ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా దక్కవు. దివంగత నేత ఆశయాలను పట్టించుకోని ఈ సర్కారును కొనసాగించాల్సిన నైతిక బాధ్యత కూడా మాకు లేదు. ఇప్పటికైనా పేదవాడి ఆకలి కేకలు వినాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాను. సర్కారుకు జ్ఞానోదయం చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఫీజు పోరు వేదిక మీద నుంచి లక్షల మంది విద్యార్థులతో కలిసి నేను చేస్తున్న డిమాండు ఒక్కటే.. బడ్జెట్‌కు ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు మొత్తం చెల్లించాలి. ఈ బడ్జెట్‌లో సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి. బకాయిలన్నీ తీర్చి బడ్జెట్‌లో కొత్త సంవత్సరానికి అవసరమైన కేటాయింపులు చేయాలి.

గర్జించిన విద్యార్థి
జగన్ ‘ఫీజు పోరు’కు పోటెత్తిన విద్యార్థులు, తల్లిదండ్రులు
పేదోడి చదువు గోడు పట్టని ప్రభుత్వంపై పోరు మొదలుపెట్టిన యువనేత జగన్‌కు మద్దతుగా విద్యార్థిలోకం తరలివచ్చింది. వారితోపాటే తల్లిదండ్రులూ పోటెత్తారు. సర్కారు ఫీజు కట్టకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన వరలక్ష్మిలా మరో విద్యార్థి బతుకు బలికాకూడదంటూ నినదించిన జగన్‌కు జేజేలు పలికారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ జగన్ శుక్రవారం ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నా చౌక్‌లో ‘ఫీజు పోరు’ పేరిట ప్రారంభించిన వారం రోజుల నిరాహార దీక్షకు విద్యార్థిలోకం భారీగా తరలి వచ్చింది. వేలాది మంది విద్యార్థులు దీక్షా స్థలికి చేరుకొని.. యువనేత రాక కోసం ఎదురు చూశారు.

ఉదయం 11.45 ప్రాంతంలో జగన్ వేదిక వద్దకు వచ్చినప్పుడు.. ఆయన్ను చూడటానికి విద్యార్థులు పోటీ పడ్డారు. నియంత్రించడం భద్రతా సిబ్బంది, వాలంటీర్లకు సాధ్యం కాలేదు. సర్కారు ఫీజు చెల్లించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న వరలక్ష్మి తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరో కుటుంబానికి తమ దుస్థితి రాకూడదంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఈ దీక్షను వరలక్ష్మికి అంకితమిస్తున్నట్లు ప్రకటించిన యువనేత దీక్షా స్థలికి ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణం’గా పేరు పెట్టారు.


మాతృమూర్తి ఆశీస్సులు తీసుకొని: యువనేత ఉదయం 10.45 గంటలకు తన నివాసంలో తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని ఫీజు పోరుకు బయలుదేరారు. ఆయన వెంట ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు తదితరులున్నారు. ఇంటి నుంచి పంజగుట్టకు చేరుకున్న యువనేతకు మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ ఆధ్వర్యంలో పలువురు ముస్లింలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ మహానేత వైఎస్ విగ్రహానికి జగన్ నిలువెత్తు పూలమాలవేసి నివాళులర్పించారు. అభిమానులు జి. రత్నమణి, తోట్ల సునీత, ప్రగతిరెడ్డి యువనేతకు హారతిపట్టి తిలకందిద్దారు. తర్వాత ఆయన ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇందిరాపార్క్‌కు వెళ్లారు.

విద్యార్థుల్లో సమరోత్సాహం

ఫీజులు చెల్లించలేక వరలక్ష్మి ఆత్మహత్య చేసుకొంటే.. ప్రమాదవశాత్తూ మరణించిందని ప్రభుత్వం చిత్రీకరించడానికి ప్రయత్నించిందని యువనేత చెప్పినప్పుడు ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పేదోడి ముఖంలో చిరునవ్వు చూడలేని ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా? అని జగన్ ప్రశ్నించినప్పుడు.. ‘లేదు.. లేదు’ అని తీవ్రస్థాయి స్పందన వచ్చింది.
సర్కారు కూలిపోతుంది: ఫీజులు చెల్లించకపోతే ప్రభుత్వం కుప్పకూలి పోతుందని ఓయూ విద్యార్థులు రమేష్ యాదవ్, రామకోటి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతశ్రీ కళాశాలకు చెందిన రాజేశ్వర్, వరంగల్ జిల్లా జనగామకు చెందిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కళాశాల విద్యార్థి రాకేష్ మాట్లాడుతూ.. ఫీజులు చెల్లించుకోలేని తమ దుస్థితిని వివరించారు.

వైఎస్ పేరును ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు పెట్టాలని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధి డాక్టర్ రాకేష్ డిమాండు చేశారు. తెలంగాణ యూత్ ఫోర్స్ తరఫున ఫీజు పోరుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు అజయ్ తెలిపారు. ఎస్కే యూనివర్సిటీ నుంచి వచ్చిన రంగారెడ్డి, ట్రైబల్ డెవలెప్‌మెంట్ అసోసియేషన్ కార్యదర్శి పరశురాం నాయక్.. రీయింబర్స్‌మెంట్‌కు సకాలంలో నిధులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు పడుతున్న పాట్లను వివరించారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన బీరవోలు సోమన్న కళాబృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఒంటెల ప్రదర్శన ప్రత్యేక ఆక ర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో యువనేత వెంట శాప్ మాజీ చైర్మన్ రాజ్‌సింగ్ ఠాకూర్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమృతాసాగర్, గ్రేటర్ హైదరాబాద్ యువనాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే సోదరుడు గడికోట సుదీప్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులున్నారు.

దీక్షలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

ఎంపీ: మేకపాటి రాజమోహన్‌రెడ్డి.
ఎమ్మెల్యేలు: బాలినేని శ్రీనివాస రెడ్డి, సుభాష్ చంద్రబోస్, ప్రసన్నకుమార్‌రెడ్డి, జయసుధ, కాటసాని రాంరెడ్డి, కమలమ్మ, అమరనాథ్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, శ్రీనివాసులు, బాబూరావు, రామకృష్ణారెడ్డి, కొండా సురేఖ, శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కొర్ల భారతి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, శోభానాగిరెడ్డి, గుర్నాథరెడ్డి.
ఎమ్మెల్సీలు: పుల్లా పద్మావతి, కొండా మురళి, జూపూడి ప్రభాకరరావు, టీజీవీ కృష్ణారెడ్డి.

ఈ దుస్థితి మరే కుటుంబానికీ వద్దు

‘ఫీజు పోరు’లో పాల్గొన్న వరలక్ష్మి సోదరుడు మహేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు చెల్లించలేకపోవడంతో తన చెల్లి మరణించిందని, మరే కుటుంబానికీ ఈ దుస్థితి రాకూడదని అన్నారు. ‘పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వైఎస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం నీరుగారుస్తోంది. పేదవాళ్ల చదువుల కోసం ఆయన గొప్ప ఆశయంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే ఈ పాలకులు అన్యాయం చేస్తున్నారు. ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో నా చెల్లెలు వరలక్ష్మి తనువు చాలించింది. మరే కుటుంబానికి ఇలాంటి దుస్థితి రావొద్దు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
 
‘ఫీజు’లపై సర్కారు స్పందించాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుకాక రాష్ట్రంలోని 24 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్ రోడ్డున పడింది...
 కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ ఎమ్మెల్యేల డిమాండ్
 ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుకాక రాష్ట్రంలోని 24 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్ రోడ్డున పడింది... వారి బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీలకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, గురునాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, బాబూరావు, శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. చాలామంది సామాన్య విద్యార్థులు డబ్బుల్లేక చదువులకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితుల్లో... దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని వారు చెప్పారు.

అయితే రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామాలకు వెళ్లినప్పుడు ఎస్సీ, బీసీ విద్యార్థులు చాలామంది తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కావడంలేదని తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందని కారణంగానే వరలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ, కోస్తా, రాయలసీమ మూడు ప్రాంతాల్లోనూ ఈసమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. అంతకుముందు వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు సభలో తమ సీట్ల వద్ద నిలబడి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం స్పందించాలన్న ప్లకార్డులు ప్రదర్శించారు.


ఎల్లో మీడియా అత్యుత్సాహం

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడడం మొదలుపెట్టిన ఒక్కటెండ్రు నిమిషాలకే ఎల్లోమీడియాకు చెందిన ముగ్గురు విలేకరులు ఆయన మాటలను అడ్డుకున్నారు. తాను మాట్లాడిన తర్వాత ప్రశ్నలకు జవాబు చెబుతానని చెప్పినప్పటికీ, ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.

దీంతో ఎమ్మెల్యేలు స్పందిస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగడం మీకు ఇష్టంలేదా? అని ప్రశ్నించారు. ఒక విలేకరి అత్యుత్సాహంగా స్పందించి... ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సమస్య కదా.. ఆ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ముఖ్యమంత్రిని చెయ్యండి’ అని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేలు మాట్లాడకుండా అడ్డుకున్న ఆ ముగ్గురు విలేకరులు ఆ తర్వాత రెండు నిమిషాలకే నలుగురు మంత్రులు అదే అంశంపై మాట్లాడుతున్నప్పుడు దూరంగా వెళ్లిపోవడం కొసమెరుపు.
యువతతో పెట్టుకుంటే అంతే
కొండా సురేఖ ధ్వజం
 
  ‘‘మహానేత ప్రవేశపెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్‌వేనని చెప్పుకుంటున్నారు. మరి మీ పథకాలే అయితే ఎందుకు అమలుచేయడం లేదు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని మాజీ మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా, రాజ్యమైనా కుప్పకూలిపోక తప్పదని హెచ్చరించారు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఫీజు పోరులో విజయం సాధించి, ఆ విజయాన్ని వరలక్ష్మికి అంకితమివ్వాలని కోరారు. శుక్రవారం ‘ఫీజు పోరు’ దీక్షలో పాల్గొన్న సురేఖ మాట్లాడుతూ.. వైఎస్ చనిపోయేంతవరకు రాష్ట్రంలోని ఏ ఒక్క విద్యార్థి, ఏ ఒక్క కుటుంబం కూడా ఫీజు రీయింబర్స్ గురించి ఆందోళన చెందలేదని చెప్పారు.

ఆయన మరణానంతరం ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేయడంతో బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. వైఎస్ చనిపోయినతర్వాత ట్యూషన్ ఫీజులు, ఉపకారవేతనాల కోసం ఎన్ని అప్లికేషన్‌లు తీసుకున్నారో, ఎన్నింటిని తనిఖీ చే శారో, ఎన్ని ట్రెజరీలకు పంపారో, ఎన్ని పెండింగ్‌లో పెట్టారో జిల్లాల వారీగా ప్రజలకు తెలియజెప్పాలని సర్కారును డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యార్థులు నడిసంద్రంలో కొట్టుకుంటున్న సమయంలో తన చేయినందించేందుకే జగన్ ఈ దీక్షను చేపట్టారన్నారు. వైఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో అలాంటి పోరాటాలే జగన్ చేపడుతున్నారన్నారు.

వైఎస్ ఉంటే ఈ కష్టాలు వచ్చి ఉండేవా: రోజా
వైఎస్ అధికారంలో ఉండగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని ప్రయత్నిస్తే.. ఈ ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించేందుకు నానా తంటాలు పడుతోందని సినీనటి రోజా ఆరోపించారు. వైఎస్సార్ బతికుంటే విద్యార్థులకు ఈ కష్టాలు ఉండేవి కావని, తల తాకట్టు పెట్టయినా నిధులు తెచ్చేవారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కేవలం సంక్షేమ పథకంగా చూడవద్దని, విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి పథకంగా చూడాలన్నారు. విద్యార్థుల కన్నీటిని సహించలేక వైఎస్ తనయుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా జగన్ ఆందోళన చేపట్టారని అన్నారు.
 

చేతకాకుంటే గద్దె దిగండి
  ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై పలువురు నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. పథకాలను అమలుచేయడం చేతకాకపోతే గద్దె దిగాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. ఫీజు పోరు వేదికపై ఎవరేమన్నారంటే...

రీయింబర్స్‌మెంట్.. వైఎస్ ఇచ్చిన వరం


పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని ప్రత్యేక కోణంలో చూడాలని, కేవలం సంక్షేమ పథకంగా చూడకూడదన్నది వైఎస్ ఉద్దేశం. ప్రభుత్వం తక్షణం రీయింబర్స్‌మెంటు నిధులు విడుదల చేయాలి. నేను చదువుకొనే రోజుల్లో వైఎస్ సీఎంగా ఉంటే.. మరింత ఉన్నత చదువులు చదవగలిగేవాడిని.

-పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రి

వైఎస్ వారసులమని ప్రగల్భాలు పలుకుతున్నారు


వైఎస్ వారసులమని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఆయన ఆశయాలను పూర్తిగా విస్మరించారు. ప్రస్తుతం ప్రభుత్వం దశా దిశ లేని స్థితిలో ఉంది. 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సర్కారు వ్యవహరించాలి. వైఎస్ పథకాల వల్లే ప్రభుత్వ ఆర్థిక పటిష్టత దెబ్బతిందంటూ మంత్రులు చేసిన విమర్శలు వారి దిగజారుడుతనానికి నిదర్శనం. 2010 డిసెంబరు నాటికి రూ. 7 వేల కోట్లు అదనంగా రాబడి వచ్చింది. అందులో రూ. 3,500 కోట్లు విద్యార్థులకు ఇవ్వలేకపోయారు.

-కొణతాల రామకృష్ణ, మాజీ మంత్రి

వైఎస్ ఆశయాలను మరుగున పడేశారు


వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామంటూ ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. వైఎస్ ఆశయాలను మరుగున పడేశారు. ఈ సర్కారు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తోంది. వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుంటే సాక్షాత్తు ఉపసంఘంలో ఉన్న మంత్రే అది ప్రమాదమంటూ బుకాయించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసమే జగన్ దీక్ష చేస్తున్నారు.

-బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే

విద్యార్థుల చదువుకు సర్కారు ప్రతిబంధకాలు


విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వం వారి చదువుకు ప్రతిబంధకాలు సృష్టిస్తోంది. రీయింబర్స్‌మెంట్ కింద రూ. 3,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా... రూ. 600 కోట్లు, రూ. 800 కోట్లు, రూ. వెయ్యి కోట్లు ఇస్తామని నిమిషానికో మాట చెబుతూ ఏదో బిక్షం వేస్తున్నట్లుగా సర్కారు ప్రవర్తిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి నడుంకట్టిన కార్మిక, కర్షక, విద్యార్థి పక్షపాతి అయిన జగన్‌కి అంతా మద్దతు తెలుపుదాం.

-జనక్ ప్రసాద్, సింగరేణి ట్రేడ్ యూనియన్ నేత

ఎందుకు అమలుచేయరు?


పావలా వడ్డీ, రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు నావే అంటున్న ప్రభుత్వ పెద్దలు వాటిని ఎందుకు అమలుచేయడంలేదు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జగన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా జిల్లాల్లో దీక్షలు చేపట్టాలి.

-గోనె ప్రకాశరావు, ఆర్టీసీ మాజీ చైర్మన్

చేతగాకపోతే రాజీనామా చేయండి


రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేయడం చేతగాకపోతే కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ఆస్తులు తనఖా పెట్టడం కాదు.. మంత్రుల క్వార్టర్లు తనఖా పెట్టి ఫీజులు చెల్లించండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయం.

- గజ్జెల కాంతం, అంబేద్కర్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు

తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం


వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వానికి.. జగన్ దీక్ష వణుకు పుట్టించాలి. మనమంతా జగన్‌కు వెన్నంటి నిలవాలి.

- కేకే మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత

ప్రభుత్వం వల్ల అన్ని వర్గాల ప్రజలు పరేషాన్


విద్యార్థులు, రైతులు, కార్మికులు.. అన్ని వర్గాల ప్రజలు ప్రస్తుత ప్రభుత్వం వల్ల పరేషాన్ అవుతున్నారు. ప్రజల కోసం ముందుండి పోరాటం చేస్తున్న జగన్‌కు మద్దతుగా నిలుద్దాం.

- ఫర్జాన్ బేగం, కదిరి మున్సిపల్ ఛైర్మన్

నేటి దీక్షలో న్యాయవాదులు

జగన్ చేపట్టిన ఫీజుపోరు దీక్షలో రెండో రోజైన శనివారం హైదరాబాద్‌కు చెందిన న్యాయవాదులు పాల్గొంటారని అంబటి రాంబాబు చెప్పారు. నల్లగొండ జిల్లాకు చెందిన బీరవోలు సోమిరెడ్డి నేతృత్వంలో యువనేత జగన్‌పై రూపొందించిన పాటల సీడీని దీక్షల శిబిరంలో ఆవిష్కరించారు.

No comments:

Post a Comment