Monday, February 21, 2011

విద్యార్థులతో పోటెత్తిన వరలక్ష్మి దీక్షా ప్రాంగణం ... బడుగుల కోసం... * మూడో రోజూ అదే జోరు .... ముమ్మరమైన ‘ఫీజు పోరు’

సంఘీభావంగా ఓయూ, నాగార్జున, ఆంధ్రా, కాకతీయ, జేఎన్‌టీయూ విద్యార్థుల నిరాహార దీక్ష
విద్యార్థులతో పాటే కదిలివచ్చిన తల్లిదండ్రులు.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్
నీరసించినా వేదికపై కూర్చునే దీక్ష..అభిమానులను నిరుత్సాహపరచకుండా కరచాలనం...
మూడో రోజు విద్యార్థులతో పోటెత్తిన వరలక్ష్మి దీక్షా ప్రాంగణం


‘తినడానికి తిండిలేక.. నకనకలాడే కడుపులో కాసిన్ని నీళ్లు పోసి రోజు గడిపేసేవాళ్లున్నారు.. తినడానికి అన్నీ ఉండి కూడా జబ్బులతో తినలేనివాళ్లున్నారు.. దేవుడి కోసం రోజంతా ఉపవాసంచేసే వాళ్లూ ఉన్నారు. కానీ జగన్ పేదోడి చదువు కోసం కడుపు కాల్చుకుంటున్నాడు.. ఫీజుల పథకానికి చిల్లులెడుతున్న సర్కారు మాత్రం కడుపులో చల్ల కదలకుండా కూచుంది’.. ఇదీ ఆదివారం ‘ఫీజు పోరు’కొచ్చిన ఓ విద్యార్థి గుండె ఘోష. ఇతడిలాగే.. తమ కోసం నిరాహార దీక్ష చేస్తున్న యువనేతను చూడ్డానికి వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వేల మంది విద్యార్థులతో ఆదివారం ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణం’ కిక్కిరిసిపోయింది.

చీమలదండులా


మూడో రోజులో అడుగుపెట్టిన ఫీజు పోరుకు ఆదివారం జనం పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులతో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ఓ మహా సంద్రాన్ని తలపించింది. ప్రత్యేకించి హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు చీమల దండులా కదలి వచ్చారు. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రభంజనంలా తరలివచ్చారు. యువనేతను చూసేందుకు భారీగా వచ్చిన రైతన్నల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నల్గొండ, మెదక్, ఖమ్మం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు చెందినవారు ఎక్కువ మంది ఉన్నారు. వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షా శిబిరంలో కూర్చొన్నారు. పేదల సంక్షేమానికై జగన్ చేస్తోన్న దీక్షలు విజయవంతం కావాలని, సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడు కలుగజేయాలని ఆశీర్వదించారు. వీరితోపాటు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు దీక్షా ప్రాంగణానికి వచ్చి యువనేతకు మద్దతు ప్రకటించారు.
మూడో రోజూ అదే జోరు .... ముమ్మరమైన ‘ఫీజు పోరు’
 
వెల్లువలా తరలివచ్చిన విద్యార్థులు
దీక్షా శిబిరానికి మహిళల నీరాజనం
యువనేత ఆరోగ్యంపై అంతటా ఆందోళన


అన్ని మార్గాలూ అక్కడికే ‘దారి’తీస్తున్నాయి. ఆదివారమూ ఆటవిడుపు లేదు. అందరిలోనూ యువనేతను సందర్శించాలన్న ఆరాటం. విద్యార్థి లోకానికి బాసటగా నిలిచిన దీక్షాదక్షునికి అండగా నిలవాలనే ఆశయం.. మూడోరోజున ధర్నా చౌక్‌లోని ‘వరలక్ష్మి ప్రాంగణం’ జనసంద్రమైంది. అందరిదీ ఒకటే లక్ష్యం. యువనేత జగనన్నను కలిసి మద్దతు ప్రకటించడమే ధ్యేయం.

ఫీజు పోరులో మూడోరోజూ అదే జోరు. ఆదివారం ఆంధ్రా, నాగార్జున, వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల నుంచి వందలాది విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారిలో కొందరు జగన్‌కు సంఘీభావం ప్రకటించి దీక్షలో కూర్చున్నారు. చంకన చంటిపిల్లాడిని వేసుకొని వచ్చిన మహిళలు, ఊతకర్ర సాయంతో ఉత్సాహంగా వచ్చిన వృద్ధులు... దీక్షార్ధి అయిన యువనేతలో తమ తమ్ముడిని, అన్నను, తనయుడిని చూసుకొని కంటతడి పెట్టారు. మూడు రోజులుగా ఆహార పానీయాల్లేక శుష్కించిన యువకిశోరంపై వాత్సల్యాన్ని కురిపించారు. మొండివైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం వెంటనే దిగిరావాలంటూ పెద్దపెట్టున నినదించారు.

దీక్షలో పాల్గొన్న లక్ష్మీపార్వతి, జూపూడి ప్రభాకర్, నల్గొండకు చెందిన సిరాజుద్దీన్ చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ దమననీతిని ఎండగట్టినప్పుడల్లా వారు కరతాళధ్వనులతో తమ మద్దతు ప్రకటించారు. ఇదీ దీక్షా శిబిరం వద్ద ఆదివారం ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు కన్పించిన తిరునాళ్ల వాతావరణం. ప్లకార్డులు పట్టుకొని, డప్పు నృత్యాలతో బృందాలు బృందాలుగా ప్రజా శ్రేణులు తరలివచ్చి యువనేతకు సంఘీభావం తెలిపారు.

నీరసం కమ్ముకొస్తున్నా....
ఏకబిగిన 72 గంటలుగా దీక్షలో ఉన్న జగన్ ఆదివారం కాసింత నీరసంగా కన్పించడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఓ వైపు నీరసం కమ్ముకొస్తున్నా.... నిజమైన నాయకుడిగా తనను చూసేందుకు వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించేందుకు జగన్ ప్రయత్నించారు. క్యూలైన్‌లో పరామర్శించే వీలులేనంత సంఖ్యలో ప్రజలు రావడంతో జగన్ తానే లేచి నిలబడి పలుసార్లు ప్రజలందరికీ అభివాదం చేశారు. ఈ సమయంలో ప్రజల నుంచి జయ జయ ధ్వానాలు మిన్నుముట్టాయి. సుదూరం నుంచి వచ్చిన మహిళా అభిమానులకు మాత్రం ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దీక్షా శిబిరం వేదిక వద్దకు వెళ్లేందుకు అవకాశం క ల్పించారు. అయితే... యువనేత ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ఎటువంటి వాకబు చేయకపోవడంపై మహిళలు, విద్యార్థుల నుంచి తీవ్ర ఆగ్ర హం వ్యక్తమైంది.

నీరసించినా.. వేదికపై కూర్చునే..

శుక్రవారం ప్రారంభించిన నిరాహార దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరింది. ఆదివారం జగన్ కాస్తంత నీరసంగా కనిపించారు. అయినా రోజంతా ఆయన దీక్షా వేదిక మీద కూర్చునే ఉన్నారు. అప్పుడప్పుడు లేచి నిలబడి విద్యార్థులకు అభివాదం చేశారు. సాయంత్రానికి లేచి నిలబడటానికి కాస్తంత ఇబ్బంది పడ్డారు.

చేయి కలపాలని...


యువనేత జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో దీక్షా స్థలికి వచ్చారు. యువనేతను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అప్పటికే.. జగన్‌ను చూడటానికి జనం బారులు తీరారు. ఉదయం 6 గంటలు మొదలు.. అర్ధరాత్రి వరకు జన ప్రవాహం సాగుతూనే ఉంది. విద్యార్థులు, యువకులు జగన్‌తో చేయి కలపాలని పరితపించారు. కొందరితో కరచాలనం చేయగలిగిన యువనేత.. మిగతా వారికి అభివాదం చేశారు.


వైఎస్ వస్తాడని..


‘మా ఊరి రచ్చబండ చూస్తోంది.. వైఎస్ వస్తాడని, ఓసారి రారాదయ్యో.. ఓ సారూ మము చూసి పోరాదయ్యో..’ అంటూ కొండా మురళి ఆధ్వర్యంలోని కొండా దళం(కళాకారుల బృందం) పాడిన పాట ఆదివారం హైలైట్‌గా నిలిచింది. కళాకారుల ఆలాపనతో దీక్షాశిబిరంలో కూర్చొన్న వారికి దివంగత వైఎస్సార్ తమ కళ్లముందు సాక్షాత్కారమైనట్లైంది. బిక్కవోలు సోమిరెడ్డి కళాబృందం, నల్లగొండ కళాబృందాల ప్రదర్శనలు విద్యార్థులు అవస్థలను ఎలుగెత్తి చూపాయి.


యువనేతకు తోడుగా విద్యార్థుల దీక్ష


జగన్ దీక్షకు సంఘీభావంగా ఉస్మానియా, ఆంధ్ర, నాగార్జున, కాకతీయ, జేఎన్‌టీయూ వర్సిటీలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులు ఆదివారం అదే వేదికపై నిరాహార దీక్ష చేశారు. ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభించిన విద్యార్థులు.. సాయంత్రం 6 గంటలకు ముగించారు. ఈ దీక్షలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన శ్యాం సుందర్, రాజేశ్, అంజిరెడ్డి, నరేంద్రాచారి, సయ్యద్ ఆలీ, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన స్వర్ణకుమార్, సీవీ రత్నం, ఆంజనేయరెడ్డి, నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన నాగిరెడ్డి, రమేష్, సీహెచ్ మురళీకృష్ణ, రఫి, జేఎన్‌టీయూకి చెందిన తోట వేణు, ఎస్వీ యూనివర్సిటీకి చెందిన మహేశ్, ఎస్కే విశ్వవిద్యాలయానికి చెందిన జే లింగారెడ్డి, ఇమాం, కాకతీయ వర్సిటీకి చెందిన రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ప్రజాప్రతినిధుల మద్దతు


ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, బాలరాజు, ప్రసాదరాజు, మేకతోటి సుచరిత, శ్రీనివాసులు, శోభానాగిరెడ్డి, గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు జూపూడి, కొండా మురళి, పుల్లా పద్మావతితోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ యూత్ ఫోర్స్, మైనార్టీ యువజన, విద్యార్థి సంఘం, ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్, లంబాడా హక్కుల పోరాట సమితి, తెలంగాణ రాష్ట్ర రజక సంఘం, తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు దీక్షా ప్రాంగణానికి వచ్చి యువనేతకు మద్దతు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సోదరుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి కుటుంబ సమేతంగా వచ్చారు. నాగర్ కర్నూలు నుంచి వల ్లపల్లి శ్రీనివాసులు, శేరిలింగంపల్లి నుంచి ముక్కా రూపానందరెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి వర్లపు రాము, ఎల్బీనగర్ నుంచి పుత్తా ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా యువకులు, విద్యార్థులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు.
ప్రజా సమస్యలే జగన్ జీవితం
ఉద్వేగంగా ప్రసంగించిన లక్ష్మీపార్వతి
‘ప్రజా సమస్యలపై ఉద్యమించడానికి మహాతల్లి విజయలక్ష్మమ్మ అద్భుతమైన బిడ్డను సమాజం కోసం బయటకు పంపింది. ఎన్నో సుఖాలు అనుభవించే అవకాశమున్నా ప్రజల సమస్యలనే జగన్ జీవితంగా మార్చుకున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరచి పేదల పిల్లలు కూడా ఉన్నతచదువులు పొందే అవకాశం కలిగించిన వైఎస్సార్ కుటుంబానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి’ అని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ నిధుల కోసం యువనేత వైఎస్ జగన్ చేపట్టిన ‘ఫీజు పోరు’ దీక్షలో మూడోరోజైన ఆదివారం ఆమె పాల్గొని ప్రసంగించారు. సమాజం తయారు చేసుకుంటున్న ఏకైక నాయకుడు జగన్ అని, ఇలాంటి నాయకుడిని గతంలో ఎప్పుడైనా చూశామా అని అన్నారు. ప్రస్తుతం రాష్ర్ట ప్రజలకు కావాల్సింది అవినీతికి అంకితమైన నేతలు కాదని, నెత్తురు మండే శక్తితో ఉన్న అగ్నిపర్వతం లాంటి నాయకులని వ్యాఖ్యానించారు. 
ఆత్మవిమర్శ చేసుకోవాలి
జగన్ దీక్షను విమర్శించేవారిపై కొండాసురేఖ ధ్వజం

‘‘వైఎస్ చనిపోయిన ఏడాదిన్నర తర్వాత కూడా రాష్ట్రంలో ఆయనలేని లోటు స్పష్టంగా కనపడుతోంది. పేద విద్యార్థుల ఫీజు కోసం నడిరోడ్డు మీద ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఫీజులు కడతామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేని వారు... జగన్ దీక్షను విమర్శించే ముందు గుండెలపై చేయి వేసుకుని ఆత్మ విమర్శ చేసుకోవాలి’’ అని మాజీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ‘ఫీజుపోరు’ దీక్షాస్థలి వద్ద ఆదివారం విద్యార్థులు సురేఖ మాట్లాడాలని గొడవ చేయడంతో వారినుద్దేశించి ఆమె ప్రసంగించారు. సంక్షేమపథకాలను అమలుచేసే సత్తా లేకపోతే తప్పయిందని ఒప్పుకోవాలే కానీ వైఎస్‌ను అభాసుపాలు చేయాలని ప్రయత్నిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. జగన్ మాత్రమే వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలరని చెప్పారు. భూమి, ఆకాశం ఉన్నంతకాలం వైఎస్ రాష్ట్ర ప్రజల హృదయాల్లోనే ఉంటారన్నారు. ఈజిప్టు తరహాల్లో ప్రభుత్వాన్ని పడవేసే అవకాశం ప్రజలు తీసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు.

ఒక ప్రాంతీయ పార్టీకి మోకరిల్లారు

జగన్ ఓదార్పుయాత్రకు అనుమతి ఇవ్వకుండా కాంగ్రెస్ హైకమాండ్ ఒక తప్పు చేసిందని, దానిని కప్పిపుచ్చుకునేందుకు తప్పుమీద తప్పులు చేసి చివరకు ఒక ప్రాంతీయ పార్టీ ముందు మోకరిల్లాల్సిన దుస్థితి తెచ్చుకుందని సురేఖ ఎద్దేవా చేశారు. విలీనం వార్తల తర్వా త అసెంబ్లీలో చిరంజీవికి షేక్‌హ్యాండ్ ఇచ్చేవారు కూడా కరువయ్యారని చెప్పారు. జగన్ దీక్షకు జనం రావడంలేదని వార్తలు ప్రసారం చేస్తున్న కొన్ని చానళ్లపై సురేఖ మండిపడ్డారు. గుంటనక్కల్లా చాటుమాటుగా తిరుగుతూ రికార్డు చేసుకుంటారని విమర్శించారు. అయినా వారు చూపించింది నమ్మడానికి ప్రజలు అంత అమాయకులు కాదని ఆమె చెప్పారు.  
జగన్‌కు అండగా నిలవాలి.... బీసీలకు నారగోని పిలుపు
 
 బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం బలమైన ఆశయంతో దీక్ష చేపట్టిన జగన్‌కు భవిష్యత్తులో వెనుకబడిన వర్గాలు అండగా నిలవాలని బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వి.జి.ఆర్ నారగోని పిలుపునిచ్చారు. ఆయన శనివారం ‘ఫీజు పోరు’ దీక్షాస్థలికి విచ్చేసి యువనేత జగన్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగబోతోంది. కాంగ్రెస్‌ను గద్దె దించాలని, టీడీపీని ఓడించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. మాట మీద నిలబడే వ్యక్తి కోసం రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తోంది. జగన్ పెట్టబోయే రాజకీయ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి వాగ్దానాలను నిలబెట్టుకోలేని పార్టీలకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు బుద్ధి చెప్పాలి’’ అని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. 
మీరు చేతులెత్తేస్తే.. మేం చూసుకుంటాం ...  ఫీజులపై సర్కారుకు జూపూడి ప్రభాకర్ సవాల్
 
అధికారం కోసం అర్రులు చాచిన ప్రభుత్వ పెద్దలు, వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలను కాదని కాడి పడేసిన నాయకులు ఆ మహానేతకు నిజమైన వారసులెలా అవుతారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ప్రశ్నించారు. విద్యార్థులను ఉద్దేశించి ఫీజు పోరు వేదిక నుంచి ఆదివారం ఆయన మాట్లాడారు. వారసుడిగా రక్తమాంసాలే కాదు... ఆయన ఆశయాలనూ భుజానికెత్తుకున్న నిజమైన వారసుడు జగనేనని, కళ్లుంటే చూడాలని అన్నారు. హాస్టళ్లు, కార్పొరేషన్లు ఆస్తులను తాకట్టు పెట్టడానికి ఎవరబ్బ సొమ్మని నిలదీశారు. ఫీజులు చెల్లించలేమని చేతులెత్తేస్తే చెప్పాలని, తాము చూసుకుంటామని ప్రకటించారు. జగన్ దీక్ష చేయడానికి ఒక్క రోజే అనుమతి ఇచ్చామని ప్రభుత్వం చెబుతోందని, ప్రభుత్వానికి ధైర్యం ఉంటే జగన్‌ను ఢీకొని చూడాలని సవాలు విసిరారు. ప్రజల కోసం పోరుబాట పట్టిన జగన్‌ను ఒక్క గంట అరెస్ట్ చేస్తే... రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు.  
 
మేమంతా నీవెంటే జగనన్న..
బీకాం విద్యార్థిని ప్రశాంతి వ్యాఖ్య
విద్యార్థి లోకం యువనేతకు అండగా ఉండాలని వినతి


 తమ సమస్యల కోసం ఆందోళన చేస్తున్న యువనేత జగన్‌కు విద్యార్థి లోకం అండగా నిలవాలని బీకాం విద్యార్థిని ప్రశాంతి కోరింది. ఆదివారం ఫీజుపోరు దీక్షాశిబిరానికి తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఆమె జగన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ‘వైఎస్సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలాంటి పేద విద్యార్థులు ఎంతో లబ్ధి పొందారు. ఆయన చనిపోయిన తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో నేనేమి పొందానంటే.. ఏమీ లేదు. అసలు ఈ ప్రభుత్వం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ ప్రభుత్వమే బాగుంటే ఫీజుపోరుకు నేను వచ్చే అవకాశమే ఉండేది కాదు. అందుకే మన సమస్యల పరిష్కారానికి విద్యార్థులంతా జగన్‌కు అండగా నిలవాలి’ అంటూ ఉద్వేగంగా మాట్లాడింది. జగన్‌కు అండగా నిలబడతామని ఇక్కడే మాట ఇవ్వాలని అంటూ.. ‘జగన్‌కు అండగా ఉంటారా లేదా’ అని ప్రశాంతి ప్రశ్నించడంతో అక్కడ ఉన్న విద్యార్థులంతా ‘జై జగన్’ అని నినదించారు. జగనన్న ఒంటరికాదని, తామంతా ఆయనకు అండగా ఉన్నామని ప్రశాంతి చెప్పింది.

తాను ఇళ్లల్లో పనిచేసుకుని స్కూలు చదువుల వరకు చదువుకున్నానని, తర్వాత వైఎస్ దయ వల్ల ఇంటర్ పూర్తి చేసుకుని.. ఇప్పుడు డిగ్రీ చ దువుకుంటున్నానని ఆమె చెప్పింది. అయితే, జగన్‌ను కలవాలన్న ఆశతో ఎంతోమంది తనలాంటి విద్యార్థులు ఇక్కడకొస్తున్నారని, ఆయనను కలిసే క్రమంలో విద్యార్థులను పోలీసులు ఇబ్బందులు పెట్టవద్దని కోరింది. ‘నేను ఈ వేదిక మీదకు వచ్చేందుకు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. పోలీసులను నేను విమర్శించడం లేదు. కానీ మా జగనన్నను కలిసేందుకు విద్యార్థులకు సహకరించండి’ అని ఆమె చెప్పడంతో ధర్నాచౌక్ కరతాళ ధ్వనులతో మార్మోగింది. ఎస్‌కేయూ విద్యార్థి ఇమాం, అనంతపురం జిల్లా విద్యార్థి నేత సోమశేఖరరెడ్డి, ఓయూ విద్యార్థులు అంజిరెడ్డి, నరేంద్రాచారి, శ్యాంసుందర్‌లు మాట్లాడారు.

బీహార్ విద్యార్థుల మద్దతు

యువనేత జగన్ ఫీజు పోరుకు బీహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు మద్దతు ప్రకటించారు. ఆదివారం కొందరు విద్యార్థులు దీక్షా శిబిరానికి వచ్చి జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీహార్ విద్యార్థి ఇర్షాద్ మాట్లాడుతూ జగన్ లాంటి నాయకుడిని తాను ఇప్పటివరకు చూడలేదన్నారు.
జగన్‌కు వైద్య పరీక్షలు

మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న యువనేత జగన్‌కు ఆదివారం సాయంత్రం వైద్యపరీక్షలు నిర్వహించారు. శనివారం వైద్య పరీక్షలు చేసేందుకు డాక్టర్లు రాగా జగన్ తిరస్కరించారు. ఆదివారం గాంధీనగర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ వేదిక మీదకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని యువనేతను కోరారు. ఆయన సమ్మతించడంతో గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించింది. బీపీ, షుగర్ స్థాయి సాధారణంగానే ఉందని వైద్యులు నిర్ధారించారు.

No comments:

Post a Comment