Thursday, July 21, 2011

ఇబ్బందులెదురైనా నాన్న బాటలోనే...........

నంద్యాల సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటన 
కేబినెట్ సమష్టి నిర్ణయాలైనా.. వైఎస్ ఒక్కడిపై బురదజల్లేందుకే కేసులు
కాంగ్రెస్, టీడీపీ నన్ను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నాయి
రెండెకరాలతో రాజకీయాల్లోకొచ్చిన బాబుకు
ఇప్పుడు వీధివీధినా హెరిటేజ్ షాపులెలా వచ్చాయి?


కర్నూలు జిల్లా ఓదార్పు యాత్ర : ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చూపిన బాటలోనే నడుస్తానని, ఆయన ఆశయాలను కొనసాగించి తీరతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ‘‘ఇవాళ నన్ను, నా తల్లిని నాశనం చేయాలన్న దురుద్దేశంతో చంద్రబాబు, కాంగ్రెస్, ఈనాడు, మరో తోకపత్రిక, టీవీ-9 చానెల్ అందరూ ఒక్క తాటిపైకి వచ్చారు. అయినా బెదిరేది లేదు. మాట తప్పేది లేదు.. వారందరికీ లేనివి.. నాకు, నా తల్లికి మాత్రమే అండగా ఉన్నవి.. ఆ దేవుడి దయ, వైఎస్‌ను అభిమానించే గుండె చప్పుడు’’ అని ఆయన ఉద్వేగంగా అన్నారు. కర్నూలు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా ఆయన బుధవారం రాత్రి 11:30కు నంద్యాల బహిరంగ సభలో ప్రసంగించారు. దాదాపు ఆరుగంటలు ఆలస్యంగా జగన్ ఇక్కడికి చేరుకున్నారు. అంత ఆలస్యమైనప్పటికీ వేలాది మంది ప్రజలు నిరీక్షించారు. స్థానిక శ్రీనివాస సెంటర్‌లో వైఎస్ విగ్రహావిష్కరణ అనంతరం ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్, టీడీపీలపై నిప్పులు చెరిగారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

‘మాట ఇస్తే కష్టమైనా నష్టమైనా తప్పకూడదని, ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం.. బతికనంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యమని నమ్మి.. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి రాజశేఖరరెడ్డి. ఆ మహానేతకు పుట్టిన కొడుకుగా ఆయన బాటలోనే నడుస్తూ నేను ఇచ్చిన మాట కోసం నిలబడ్డా. బాధెక్కడ అనిపిస్తోందీ అంటే.. ఆ మహానేత రెక్కల కష్టంమీద ఏర్పడిన రాష్ట్ర, దేశ ప్రభుత్వాలు ఈ రోజు ఆ కృతజ్ఞత కూడా లేకుండా.. ఆయన చనిపోయారన్న ఆలోచన కూడా లేకుండా, ఆయన తిరిగివచ్చి సమాధానం చెప్పుకోలేరన్న సంగతి తెలిసి.. రాజశేఖరరెడ్డిపై బురదజల్లుతున్నాయి. ఆయన చేసిన పాపమల్లా ఒకటే ఒకటి.. చనిపోయిన తర్వాత ప్రతి గుండెలో బతికి ఉండడమే. నేను చేసిన తప్పల్లా ఒకటే ఒకటి.. ఇచ్చిన మాట మీద నిలబడడం, దాని కోసం ఎంతవరకైనా పోరాడ్డానికి సిద్ధపడడమే.


మీరంతా కలిసి తీసుకున్న నిర్ణయాలే కదా..: ఆ మహానేత మీద బురదజల్లడానికి కాంగ్రెస్ పెద్దలు ఎన్ని కుట్రలు పన్నుతున్నారంటే... అదే పార్టీకి చెందిన మంత్రితో కోర్టులో కేసు వేయిస్తారు. వైఎస్ చనిపోయి రెండేళ్లయిపోయాక ఇప్పుడు కేసు వేశారేంటయ్యా అని అడిగితే..సోనియా వెయ్యమంటేనే వేశాను అంటారా మంత్రి. ఆ రోజు కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు.. మంత్రివర్గ సభ్యులంతా కలిసి తీసుకున్నవి కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ కాంగ్రెస్‌కు టీడీపీ కూడా తోడై.. రెండూ కలిసి నన్ను రాజకీయంగా అణగదొక్కడం కోసం చనిపోయిన నాన్నపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి.


బాబు రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చారు..: ఇదే చంద్రబాబు నాయుడుగారు.. తనపై అవినీతి ఆరోపణలు వస్తే.. వాటిపై స్టే తెచ్చుకుని ఆరేళ్లుగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈయన రెండెకరాలతో రాజకీయ జీవితం మొదలుపెట్టారు. ఈ రోజు ఆయనకు వీధి వీధినా హెరిటేజ్ ఫ్రెష్ షాపులు ఎలా వచ్చాయి? ఆ వేళ బాబు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలీ అంటే.. సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారాయన. ఈరోజు అదే కాంగ్రెస్‌తో కుమ్మక్కై.. జగన్‌ను రాజకీయంగా నాశనం చేయాలి అని, వైఎస్‌ను భ్రష్టుపట్టించాలన్న దురుద్దేశాలతో సీబీఐ విచారణ వేయించాలని సిగ్గులేకుండా అడుగుతున్నారు.


ప్రభుత్వంలో ఉంటూ కోర్టుకెందుకు వెళ్లారు?
*మంత్రి శంకర్రావుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత గట్టు ధ్వజం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని మంత్రి శంకర్రావు ప్రశ్నించడాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తప్పుబట్టారు. కోర్టులు ఏమైనా ఆయన జాగీరా అంటూ మండిపడ్డారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని శంకర్రావు అడగటానికి.. న్యాయస్థానాలేమైనా ఆయన జాగీరా? లేదా ఆయన జేబు సొత్తా?’’ అని ప్రశ్నించారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులను స్వీకరించవద్దని గతంలో సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. ‘‘రాజకీయ కుట్రలో భాగంగా తన ఆస్తులపై సీబీఐ విచారణ చేపట్టడం సరికాదంటూ జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దాన్ని మంత్రి శంకర్రావు ప్రశ్నించడం ఆశ్చర్యకరంగా ఉంది. ప్రభుత్వంలో భాగస్వామి అయిన మీరు ముందు కోర్టును ఎందుకు ఆశ్రయించారో బదులివ్వాలి. నేరుగా విచారించే అర్హత పెట్టుకొని, కోర్టుకు ఎందుకు లేఖ రాశారు? మీ ప్రభుత్వంపై మీకే నమ్మకం లేదా? సీఎంపై నమ్మకం లేదా?’’ అని నిలదీశారు. భారతదేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పుకున్న రాహుల్‌కు ప్రధాని అయ్యే అర్హత ఉన్నప్పుడు... దేశ పౌరుడైన జగన్ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడంలో తప్పేముందన్నారు. సోనియా ఆదేశాల మేరకే లేఖ రాశానని శంకర్రావే స్వయంగా ఒప్పుకున్నారని, ఆ తర్వాతే ఆయనకు మంత్రి పదవి వచ్చిందన్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై జగన్‌ను టార్గెట్ చేశాయనడానికి శంకర్రావు రాసిన లేఖేఆధారమన్నారు. రెండు పార్టీలకు అవగాహన ఒప్పందం కుదర్చడంలో ‘ఈనాడు’ అధినేత రామోజీ మధ్యవర్తిత్వం నడిపారని ఆరోపించారు.
 

No comments:

Post a Comment