Friday, May 20, 2011

మ్యాచ్ ఫిక్సింగ్ బాబూ... అవిశ్వాసం పెట్టరేం? * చంద్రబాబుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్న

నాడు వైఎస్ సువర్ణయుగం నడుస్తున్నప్పుడు ....
47 మంది ఎమ్మెల్యేలతోనే అవిశ్వాస తీర్మానం పెట్టారే..
ఈరోజు 90 మంది ఎమ్మెల్యేలు ఉండీ..
ఈ సర్కారు మాకొద్దని రైతులంటున్నా నోరు మెదపరేం..
{పజల పక్షాన పోరాడాల్సిన మీరు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు
అతి త్వరలో రెండు పార్టీలు బంగాళాఖాతంలో కలిసిపోతాయి
రాష్ట్రంలో ప్రతిపక్షమేదైనా ఉందంటే అది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే
ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది


ఈ చేతకాని సర్కారును సాగనంపాలి అని రోడ్డెక్కి మాట్లాడుతున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టట్లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పేదల పక్షాన, రైతుల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్ష తెలుగుదేశం.. అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని, అందువల్లే రైతులు, పేదల సమస్యలను గాలికి వదిలేసిందని ఆయన దుయ్యబట్టారు. ఆయన ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అని నోటిమాటగా అయితే అంటారుకానీ సాగనంపరని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని పెండ్లూరు, చాగలేరు గ్రామాల్లో శుక్రవారం ఆయన వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సువర్ణయుగం సాగుతున్నప్పుడు.. రైతులకు ఎంఎస్‌పీని మించి ధర 47మంది ఎమ్మెల్యేల బలం కూడా సరిగాలేని చంద్రబాబు ఈ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదంటూ అవిశ్వాస తీర్మానం పెట్టారు. మరి ఈ రోజు రోడ్డెక్కి మొసలి కన్నీరు కారుస్తూ.. ప్రజల పట్ల, పేదల పట్ల ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న మీకు గుర్తుకు రావట్లేదా చంద్రబాబూ.. ఇవాళ మీకు 90మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రతి రైతు సోదరుడు, పేదవాడు ప్రస్తుత ప్రభుత్వం దిగిపోవాలని వేయి కళ్లతో ఎదురుచుస్తున్నాడు.. అయినా మీరు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టట్లేదు?’ అని జగన్ నిలదీశారు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న బాబు.. అవిశ్వాస తీర్మానం పెట్టనుగాక పెట్టనంటున్నారంటూ ఎద్దేవా చేశారు.


ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది


‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధాన్యం కనీస మద్దతు ధర వేయి రూపాయలుగా ఉంది. ఆ ఐదేళ్లలో రూ. 1200 ధరకు కూడా రైతులు ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఆయన చనిపోయిన తరువాత, సువర్ణ యుగం పోయాక.. కనీస మద్దతు ధర కంటే రూ. 150 నుంచి రూ. 200 తక్కువకు అమ్ముకునే అధ్వాన్న స్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక ప్రతిపక్షం, పేదల వ్యతిరేక ప్రభుత్వం రెండూ కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విసుగు చెందిన ప్రతి పేదవాడు, ప్రతి రైతు ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో ఎప్పుడు కలుస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారని జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో దేవుడు దయ తలిస్తే, వైఎస్ ఆశీస్సులు అందరికీ ఉంటే వైఎస్‌ను అభిమానించే గుండె చప్పుడులన్నీ ఏకమై.. ఇంతమంది పేదల ఉసురుపోసుకున్న ఈ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బంగాళాఖాతంలో కలిసి పోతాయని, ఆ రోజు అతి త్వరలో వస్తుందని జగన్ అన్నారు. వైఎస్ సువర్ణయుగం మళ్లీ వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ప్రతిపక్షం క నబడడం లేదు. ప్రతిపక్షం ఉందంటే అది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే. జనం సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తున్నది మేమే. ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలనుకునే పార్టీ మాది’ అని స్పష్టంచేశారు.


అలాంటి నాయకులు కరువయ్యారు

‘రాముని రాజ్యం చూడ లేదు కానీ, రాజశేఖరుని సువర్ణ యుగం చూశాను. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి రేండేళ్లు కావస్తోంది. ఆయన చనిపోయిన తరువాత పేదల మొహంలో చిరునవ్వు చూడాలని, వారి జీవితాలపై చెరగ ని ముద్రవేయాలని.. వారి గుండెల్లో బతికుండాలని, చనిపోయిన తరువాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఫొటో పెట్టుకునేలా వారికి మేలు చేయాలనే తపన రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికీ లేదు’ అంటూ జగన్ కాంగ్రెస్, టీడీపీ నాయకులనుద్దేశించి విమర్శించారు.

మెజార్టీయే సాక్ష్యం

‘వైఎస్ ఎక్కడికీ పోలేదు. ప్రతి గుండెలో బతికే ఉన్నారు. నన్నూ, నా తల్లినీ ఒంటరిని చేయకుండా ఇంత పెద్ద కుటుంబాన్నిచ్చారు’ అని ప్రజాస్పందనను చూసి జగన్ ఉద్వేగంగా అన్నారు. ఉప ఎన్నికల్లో వచ్చిన మెజార్టీయే ఇందుకు సాక్ష్యమన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలే రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది పలికాయన్నారు. 20 మంది మంత్రులు మకాం వేసినా, హైదరాబాద్ నుంచి కోట్లాది రూపాయలు తెచ్చి ఆత్మాభిమానానికి వేలం వేసి కొనాలని చూసినా.. వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఈ జిల్లాలో పుట్టినందుకు గర్వపడుతున్న కడప బిడ్డలు.. రాష్ట్రంలో, దేశంలో అందరూ చూసేటట్లు గర్వింప దగ్గ తీర్పు ఇచ్చారన్నారు. ఎన్నికల రోజున చూపిన ప్రేమాభిమానాలే ఇప్పుడు కూడా చూపుతున్నారని.. చిరునవ్వుతో ఆప్యాయత, అభిమానం పంచుతున్నారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment