Tuesday, May 17, 2011

రైతుల మేలు కోరని దగాకోరు సర్కారు * రైతన్నల సమస్యలపట్ల నిర్లక్ష్యంపై జగన్ ధ్వజం

* రూ. 2,400 ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని 5 నెలలు కావస్తున్నా ఒక్క పైసా ఇవ్వలేదు
* వైఎస్ హయాంలో రూ.1,200 దాకా మద్దతు ధర వచ్చింది...
* వ్యవసాయం దండగ.. తిన్నది అరగకే ఆత్మహత్యలన్న ఏకైక సీఎం చంద్రబాబు
* నా దీక్షతోనైనా రాష్ట్రానికి బుద్ధి, కేంద్రానికి మనసు రావాలని కోరుకుంటున్నా
* అశేష జన సందోహం మధ్య ముగిసిన జగన్ రైతు దీక్ష...

  ‘రైతు సమస్యలను పరిష్కరించడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మనసు ఉండడంతో మార్గం కనిపించింది. స్వర్ణయుగం లాంటి ఆయన పాలనలో క్వింటాలు ధాన్యం కనీస మద్దతు ధర రూ. 530 నుంచి రూ. 1,000 వరకు పెరిగింది. ఒక దశలో ఈ ధర రూ. 1,200 వరకు పోయింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతు సమస్యలపై మనసు లేకపోవడంతో మార్గం కనిపించడం లేదు. నిత్యం జగన్‌మోహన్‌రెడ్డిని ఏ విధంగా తొక్కాలా.. కుర్చీని ఏ విధంగా కాపాడుకోవాలా.. అనే ఆలోచన లతో కాలం గడిపేస్తున్నారు. జగన్‌పై దృష్టి పెట్టే సమయంలో కేవలం 10 శాతం ప్రజా సమస్యలపై పెడితే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. రైతులకు మద్దతు ధరకోసం నేను చేపట్టిన 48 గంటల దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి, కేంద్ర ప్రభుత్వానికి మనసు రావాలని కోరుకుంటున్నా’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతు సమస్యల పరిష్కారం కోసం గుంటూరులో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష(రైతు దీక్ష) ముగింపు సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు వెంకటసుబ్బయ్య గ్లూకోజ్ కలిపిన కొబ్బరినీళ్లు ఇచ్చి జగన్‌తో దీక్ష విరమింపజేశారు. దీనికి ముందు జగన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

వైఎస్‌ఆర్ పాలన సువర్ణయుగం
48 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తూ మా గోడు వినండని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చేతులు జోడించి వేడుకున్నా. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయని భావిస్తున్నా. రాముడి రాజ్యం చూడలేదు కానీ వైఎస్సార్ సువర్ణయుగం మనమంతా చూశాం. వరికి మద్దతు ధర వైఎస్సార్ హయాంలో రూ. 1,200 వరకు పోయిందంటే అది సువర్ణయుగాన్నే గుర్తుచేస్తుంది. ఆ ఐదేళ్ళలో పెట్టుబడిపై ఖర్చు ఒక్క రూపాయి కూడా పెరగలేదు.

రైతు ప్రభుత్వం వస్తేనే రైతు గురించి ఆలోచన చేస్తుంది. రైతు గురించి ఆలోచన చేస్తే రైతు మొహాన చిరునవ్వు ఉంటుందని నమ్మితేనే.. రాష్ట్ర ప్రభుత్వం, రైతన్న బాగుంటారు. అలా రైతు గురించి తెలిసిన వ్యక్తి, రైతు గురించి ఆలోచించిన వ్యక్తి వైఎస్సారే.. రైతు ముఖాన చిరునవ్వులు చూసిన ప్రభుత్వం వైఎస్సార్‌దే. ఆ ఐదేళ్లలో దేశం మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.5 శాతం పెరిగితే... మన రాష్ట్రంలో 6.78 శాతం పెరుగుదల నమోదైందని చెప్పడానికి నేను గర్విస్తున్నా.
 
ఆ ఏకైక సీఎం చంద్రబాబు
 
వైఎస్ సువర్ణయుగానికి ముందు ఒకాయన రాష్ట్రాన్ని పాలించాడు. ఆయన పేరు చంద్రబాబు. తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన ఆయన తన హయాంలో రైతులకేం చేయలేదుగానీ... ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తూ వారి వద్దకు వెళుతున్నారు. తన హయాంలో వ్యవసాయమే శుద్ధ దండగ అని అన్నారాయన. అలా అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నది అరగక చనిపోయారని అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ మాటెత్తితే.. ఆ కరెంటు ఇచ్చే తీగలలో కరెంటు ఉండదు కాబట్టి తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేశారు. అదే చంద్రబాబు ఇవాళ రోడ్డెక్కి అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లు మాటలిస్తున్నారు. మొసలి కన్నీరు కారుస్తూ.. రైతుల వద్దకెళ్ళి ఆరు గంటలేం ఖర్మ.. ఏకంగా తొమ్మిది గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తామంటున్నారు.

నేను కదిలే వరకూ.. బాబు కదలరు

ఎన్నో ఏళ్లుగా రైతులు కష్టాలు పడుతుంటే.. స్పందించని చంద్రబాబుకు.. జగన్ అనే నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రోజున మెలకువ వచ్చింది. అప్పటి నుంచి ఆయనను గమనిస్తే ఏదైనా సమస్యపై ఉద్యమిస్తానని వైఎస్ జగన్ నోటి నుంచి మాట వచ్చిన వెంటనే.. నేనూ యాత్ర చేస్తా నీతోపాటు అంటాడు. నాకు నవ్వు వ స్తోంది. రైతులు పడుతున్న కష్టాల గురించి దీక్ష చేయాలనుకుంటున్నట్లు నేను ఒక పత్రికా ప్రకటన ఇచ్చిన మూడు నాలుగు గంటలకు ఆయన నిద్ర మేల్కొని రైతుల వద్దకు వచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇంతకాలం నాకైతే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం 40 రోజులు రాత్రింబవళ్ళూ తిరుగుతున్నా. ఆయనకు ఏం పనుంది.. ఇంతకాలం ఏసీ గదుల్లో పడుకునే బదులు నేను దీక్ష చేపట్టకముందే రైతుల గురించి ఉద్యమించవచ్చు కదా! ఈ రోజు ఆ చంద్రబాబు తెలుగుదేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయ్యాయి. ప్రజలు జగన్‌వైపు పోతున్నారనుకున్న సమయంలో.. రైతులకోసం చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తూ ఉద్యమ బాట పడుతున్నారు.
ఈ సర్కారుకు సిగ్గులేదు
వైఎస్ స్వర్ణయుగం గురించి, చంద్రబాబు మొసలికన్నీరు గురించి చెప్పుకున్నాం.. ఇంకో ప్రభుత్వం ఉంది.. అది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం. మొన్న రైతు సమస్యలపై విజయవాడలో లక్షల మంది రైతులతో కలసి నేను దీక్ష చేస్తూ రూ. 4వేలు ఇన్‌పుట్ సబ్సిడీ అడిగితే రూ. 2,400 ఇవ్వడానికి అంగీకరించి దానికోసం రూ. 618కోట్లు ఇస్తామని చెప్పి ఐదు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. సిగ్గులేదీ ప్రభుత్వానికి. ఇంతేకాకుండా రైతులకు రుణ వడ్డీ మాఫీ చేస్తామన్నారు. వడ్డీ మాఫీ కావాలని అంటే రూ. 1,100 కోట్ల రుణానికి దాదాపుగా రూ. 525 కోట్లను బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాలి. చెల్లించకపోతే అవి వడ్డీనెలా మాఫీ చేస్తాయి. ప్రభుత్వం నేటివరకు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక రుణాల రీషెడ్యూల్ 10% కూడా చేయలేని పరిస్థితి కనపడుతోంది.

ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనొచ్చుకదా

ధాన్యం కొనుగోలు చేస్తే నిల్వ చేయడానికి స్థలం సరిపోవడంలేదని, స్థలం లేకపోతే తామిక ధాన్యం కొనలేని పరిస్థితి వస్తుందని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. తమ వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని ఎగుమతులకు అనుమతించాల్సిందిగా కేంద్రానికి సూచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 4 నెలలుగా వారు కోరుతున్నా సర్కారుకు పట్టడం లేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా మనతో సమానంగా ధాన్యం పండిస్తున్నారు. వారికి లేని సమస్య మనకెందుకు వస్తుందని నేను అడుగుతున్నా. పంజాబ్‌లో పండించిన ధాన్యంలో 94.2 శాతాన్ని సివిల్ సప్లరుుస్, కోఆపరేటివ్ సంస్థ, స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి విక్రయిస్తుంది. ఈ ప్రయత్నం మనరాష్ట్రంలో ఎందుకు జరగడం లేదు? అసలు ఎగుమతులను రాష్ట్రప్రభుత్వమే ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తున్నా.

మద్దతు ధర 100 పెంచాలి

ఓ రకంగా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు ఇస్తానన్న మద్దతు ధర రూ. 1000 కూడా సరిపోదు.. దాన్ని కచ్చితంగా 100 రూపాయలైనా పెంచి రూ.1100 చేయాలని నేను కోరుతున్నా. అంతేకాదు ఖరీఫ్‌లో ధాన్యానికి క్వింటాల్‌కు కేంద్ర ధరల నిర్ణాయక కమిటీ రూ.167 పెంచుతూ సిఫార్సు చేసింది. రబీలో పండిన పంటకు కూడా దీనిని వర్తింపజేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.

స్వర్ణయుగం మనమే తెచ్చుకుందాం
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి రెండు సంవత్సరాలు కావస్తోంది. ఆయనలా.. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని, తనపేరు వాళ్ళ గుండెల్లో, హృదయాల్లో కొలువుండాలని, చనిపోయిన తరువాత వారి గుండెల్లో నిలిచిపోవాలని, తన ఫొటో వారి ఇళ్లలో ఉండాలని.. అంతగా ప్రతి పేదవాడికి దగ్గరగా ఉండాలనే తపన ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికీ లేదు. రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. ప్రతి రైతు, ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వును చూసిన.. వైఎస్ స్వర్ణయుగాన్ని మనమే తెచ్చుకుందాం.

పెట్రో ధరలతో దొంగ దెబ్బ తీశారు: ఐదు రాష్ట్రాలలో ఎన్నికల అనంతరం పెట్రోలుపై రూ.5 వాత వేసి ప్రభుత్వం ప్రజలను దొంగదెబ్బ తీసింది. సంవత్సరానికి ఎనిమిది సార్లు రేట్లు పెంచి రూ.15 మేర భారం వేసింది. ఇది సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నా? ఇది రైతుల గురించి చేపట్టిన దీక్ష కాబట్టి.. ఈ విషయంపై ఇంతకుమించి ఇక్కడ మాట్లాడను.
 
ఉప్పొంగిన గుంటూరు * ముగింపు రోజున జనసంద్రంగా మారిన రైతుదీక్ష ప్రాంగణం
 
జనప్రవాహంతో గుంటూరు ఉప్పొంగింది.. అన్నదాతల వేల గొంతుకలు ఒక్కటయ్యాయి.. సమస్యలపై దిక్కులు పిక్కటిల్లేలా నినదించాయి.. తమకోసం దీక్షకు దిగిన జననేత కు జేజేలు పలికాయి..! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష ముగింపు సందర్భంగా మంగళవారం రైతన్నలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే రైతులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రాంగణానికి చేరుకున్నారు. దీక్ష ముగించిన అనంతరం జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగం ఆద్యంతం జగన్నినాదాలు, చప్పట్లతో దీక్షా ప్రాంగణం మార్మోగింది. అన్నదాతలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై జగన్ నిప్పులు చెరిగినప్పుడల్లా.. జనం హర్షధ్వానాలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ద్వంద్వ వైఖరి, కుయుక్తులను వివరిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమైంది.

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభించిన జగన్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష విరమించారు. తనను కలిసేందుకు, వినతిపత్రాలు ఇచ్చేందుకు, కరచాలనం చేసేందుకు వచ్చిన జనాన్ని జగన్ ఆప్యాయంగా పలకరించారు. మూడ్రోజులపాటు రైతులు క్యూలో నిల్చుని జగన్‌ను కలిసి, తమ గోడును వెల్లబోసుకున్నారు. వీటిలో కొన్నింటికి జగన్ తక్షణమే పరిష్కారం చూపారు. సోమవారం వెంగమాంబ కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాద బాధిత రైతులు సమస్యను విన్నవించిన క్షణాల్లోనే జగన్.. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌కు ఫోన్ చేశారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలని, ప్రతి ఒక్కరికీ పరిహారం అందించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారమయ్యేవరకూ సంప్రదింపులు జరపాలని జిల్లా నేతలకు సూచించారు.

జనమే జనం:
రైతు దీక్షాప్రాంగణం చివరిరోజు జనసంద్రంగా మారింది. గుంటూరు జిల్లాతోపాటు, కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వేలాది మంది రైతులు తరలి వచ్చారు. ఉదయం 7.30 గంటల నుంచే నేతల ప్రసంగాలు ప్రారంభమయ్యాయి.

దీక్ష విరమణ:
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు వెంకటసుబ్బయ్య కొబ్బరి నీళ్లు అందించి జగన్‌తో దీక్ష విరమింపజేశారు. మద్దతు ధరలేక 960 బస్తాల ధాన్యాన్ని బస్తా ఒక్కింటికి రూ. 680కు అమ్ముకున్న సుబ్బయ్యకు సుమారు రూ. 5 లక్షల నష్టం వచ్చిం ది. జగన్‌తోపాటు ఆయనా నిరాహార దీక్ష చేశారు.

భారీగా తరలివచ్చిన నేతలు:
జగన్ చేపట్టిన రైతుదీక్షకు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. మూడ్రోజులపాటు సాగిన ఈ దీక్షకు మొత్తం ఇద్దరు పార్లమెంటు సభ్యులు, 19 మంది శాసనసభ్యులు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు ఎమ్మెల్యే), కొండా సురేఖ (పరకాల ఎమ్మెల్యే), ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత (పత్తిపాడు), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), గొర్ల బాబురావు (పాయకరావుపేట), అమరనాథ్‌రెడ్డి (రాజంపేట), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), శేషారెడ్డి (అనపర్తి), కె.శ్రీనివాసులు (రైల్వే కోడూరు), ఎం.ప్రసాదరాజు (నర్సాపురం), బూచేపల్లి శివప్రసాదరెడ్డి (దర్శి), పి.ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కొవ్వూరు), కొర్ల భారతి (టెక్కలి), ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ), పిల్లి సుభాష్‌చంద్రబోస్ (రామచంద్రాపురం), తెల్లం బాలరాజు (పోలవరం), ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, కొండా మురళి, దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు హాజరయ్యారు.

జగన్‌కు జన వీడ్కోలు

దీక్ష విరమించిన జగన్‌కు జిల్లా ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. వేలాది మంది జగన్‌ను అనుసరిస్తూ పయనమయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ జగన్ గుంటూరు నుంచి మధ్యాహ్నం ఏలూరు బయల్దేరి వెళ్లారు.

జగన్ చెబితే అరగంటలో రాజీనామా
జగన్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన పిలుపిచ్చిన అరగంటలో నాతోపాటు అనేకమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని వ్యూహాలు, సాంకేతిక కారణాల వల్లే ఇప్పటివరకూ మేం రాజీనామాలు చేయలేదు. కడప ఉపఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పెనుతుపాను రేగనుందని నేను ముందే చెప్పాను. ఈ తుపానులో వైఎస్, జగన్‌లను విమర్శించినవారంతా కొట్టుకుపోతారు. జగన్‌తో నడుస్తున్నందువల్లే ఎప్పుడూ ఇంటిపట్టున ఉండే విజయమ్మ సైతం 40 రోజులు మండుటెండల్లో ప్రజల మధ్య తిరిగారు. ఎవరైనా ఎన్నికలు కాగానే విశ్రాంతి తీసుకుంటారు లేదా విజయోత్సవాలు జరుపుతారు. కానీ ఎన్నికల ఫలితాలకు ముందే జగన్ మళ్ళీ ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. అంతలోనే రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను గమనించి రైతుదీక్షకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే జగన్‌కు పోటీగా నిలబడగల నాయకుడెవ రైనా కనిపిస్తున్నారా?
- అనకాపల్లి ఎంపీ సబ్బం హరి

ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం
ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదన్న వాస్తవాన్ని సీఎం, మంత్రులు గ్రహించాలి. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్ళ పదవీకాలం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు సహిస్తూ ఊరుకుంటున్నారు. లేదంటే అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారు. కడప గెలుపు ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగులుతుంది. వైఎస్ లేని లోటును జగన్ తీరుస్తారు. నిజాయితీగా పనిచేయడం తప్ప టక్కుటమారాలు జగన్ ముందు చెల్లవు. మహానేత వైఎస్ భోళాశంకరుడని, జగన్ శ్రీమహావిష్ణువని సాక్షాత్తు ఓ తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత నాతో అన్నారు. ఉప ఎన్నికల్లో జగన్‌కు 50 వేల మెజార్టీ కూడా రాదని కొందరు, లక్ష మెజార్టీ దాటదని మరికొందరు, గత మెజార్టీని మించిపోరని ఇంకొందరు కబుర్లు చెబుతూ ప్రజల్ని గందరగోళంలో పడవేశారు. ఈ నేతల దొంగమాటలు నమ్మి పందేలు కాసినవారు అన్యాయమైపోయారు. ఈ రైతు దీక్షతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరచి రైతులకు న్యాయం చేయాలి.
- నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి

రైతుల కన్నీటిలో కొట్టుకుపోతుంది
రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వమూ మనుగడ కొనసాగించలేదు. ఈ రైతుల కన్నీటిలో కిరణ్ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. ఇటీవల వరుసగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే చిరంజీవి, రాహుల్‌గాంధీ ఐరన్ లెగ్‌గా ముద్రపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో రైతు సమస్యల పట్ల పోరాడుతున్న రాహుల్.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతాంగం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయాన్ని ముందు తెలుసుకోవాలి. తాము అధికారంలో ఉన్న చోట్ల సంస్కరణలు అమలు చేయడం మానేసి, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట్ల ఆందోళన చేయడం ఎంతవరకు సబబు? కడప అఖండ విజయాన్ని కొంతమంది కాంగ్రెస్ నేతలు పాలపొంగుగా అభివర్ణించారు. అందులో ఉన్నది గిన్నెడు పాలు కాదు. సప్తసముద్రాలంత అభిమానం జగన్‌పై ఉంది. కడపలో జనం ఓట్లతో ఈవీఎం కుయ్‌మంటుంటే అక్కడ ఢిల్లీలో అధిష్టానం గూబ గుయ్యిమంది.
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ

వైఎస్సార్ కాంగ్రెస్‌కు పట్టం ఖాయం
కడపలో జగన్ మెజార్టీ చూస్తుంటే.. ఆయనకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో అర్థమవుతోంది. రాష్ట్రానికి సంబంధించి లోక్‌సభ ఎన్నికల మెజార్టీలో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఆ విజయం లెక్కలోనిది కాదు. అప్పట్లో పీవీపై ఎన్టీఆర్ అభ్యర్థిని నిలబెట్టలేదు. జగన్‌కు రాష్ట్రానికి సీఎంగానే కాదు.. దేశానికి ప్రధాని కాగల లక్షణాలున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు కలిగిన గుంటూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో 17 స్థానాల్లోనూ ప్రజలు పట్టం కడ తారు.
- ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి

కాంగ్రెస్‌కు చర మగీతం పాడండి

చావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్ర ద్వారా జవసత్వాలు తెచ్చిన నేత వైఎస్. అలాంటి మహానేత దేశంలో ఏ నాయకుడూ ప్రవేశపెట్టని విధంగా పేదల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కాంగ్రెస్‌ను కూకటివేళ్ళతో పెకలించాలి. ప్రజాసమస్యలపై, రైతు సమస్యలపై ఎలాంటి అవగాహన లేని సీఎం మనల్ని పాలించడం మన ఖర్మ. వైఎస్ తర్వాత రైతుల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నాగళ్ళనే తుపాకులను చేసి మీ ఓటుతో ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు చరమగీతం పాడి జగన్ సీఎం అయ్యేదాకా అండగా నిలవండి.
-ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి

జగనే వారసుడని నిరూపించారు..

వైఎస్ వారసుడు జగన్ మాత్రమేనని కడప ఓటర్లు నిరూపించారు. రైతు దీక్షకు ఢిల్లీపెద్దలు తమ వేగుల్ని పంపి ఉంటారు. ఈ వేగుల ద్వారా అయినా రైతు గుండెచప్పుడు ఢిల్లీకి తెలుస్తుంది. కడప జిల్లాలోని తిరుమలదిన్నెలో ఓ నాలుగేళ్ల పాప మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వస్తున్నారంటే ఎవడైతే నాకేంటి? జై జగనన్న అని నినాదం చేసిందంటే జగన్ ఎంతలా ప్రజల గుండెల్లో ఉన్నారో అర్థమవుతుంది. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు సోనియా బొమ్మ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలి.
-ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు

కిరణ్ కోసం పదవి వదులుకుంటారా?

జగన్ కోసం మంత్రి పదవులు వదులుకోవడానికి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. సీఎం కిరణ్‌కోసం మంత్రి పదవి వదులుకోవడానికి కేబినెట్‌లో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రభుత్వం వెన్నెముక లేని సర్కారు. దీన్ని కూల్చడం జగన్‌కు ఒక లెక్కకాదు. వీహెచ్, శంకరరావులు కాంగ్రెస్‌ను అథఃపాతాళానికి నెట్టడానికి శాయశక్తులా కృషిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముత్యంలాంటి పార్టీ. అయితే జగన్ వెళ్లిపోయిన తర్వాత ముత్యం వెళ్లిపోయింది. ప్రస్తుతం చిప్పే మిగిలింది. ఏ జాదూ వచ్చినా కాంగ్రెస్‌ను మార్చలేరు.
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు

దేశానికే ఆదర్శం వైఎస్..

రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్‌ను చూసి దేశం ఎంతో నేర్చుకుంది. వైఎస్ పంచె కట్టుకుని వస్తుంటే రైతుకు నిజమైన ప్రతినిధిలా ఉండేవారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతును పట్టించుకునే నాథుడే లేడు. సినిమా రంగం నుంచి వచ్చిన ఓ నేత సామాజిక సేవ అంటూ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి కేవలం పదవి కోసం పార్టీని నట్టేట ముంచి నీచమైన కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ ఒక్క ప్రాజెక్టు కట్టకుండా రాష్ట్ర వ్యవసాయ రంగాన్నే దివాళా తీయించింది. మళ్లీ అప్పటి వైఎస్ పాలనను తీసుకురాగ ల వ్యక్తి జగన్ ఒక్కడే.
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ

No comments:

Post a Comment